భారత్, న్యూజిల్యాండ్ మధ్య జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ ముందు పెద్ద కాంట్రవర్సీ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు ఉపయోగించాలని అనుకున్న పిచ్ను మ్యాచ్ రోజు ఉదయం మార్చారు. దీంతో చాలా మంది దీనిపై విమర్శలు చేశారు. భారత జట్టుకు అనుకూలంగా ఉండే పిచ్పై కావాలని మ్యాచ్ నిర్వహిస్తున్నారని, భారత్ను గెలిపించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపణలు చేశారు.
భారత్ అడగడంతోనే నెమ్మదిగా ఉండే పిచ్ రెడీ చేశారని వార్తలు వచ్చాయి. వీటిపై ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ స్పందించాడు. తమకు ఐసీసీపై పూర్తి నమ్మకం ఉందని, ఇప్పటి వరకు తమకు ఈ టోర్నీలో ఎలాంటి సమస్య రాలేదని స్పష్టం చేశాడు. ఈ వార్తలు తాను కూడా విన్నానని చెప్పిన కమిన్స్.. ఐసీసీకి ప్రత్యేకమైన క్యురేటర్ ఉంటాడన్నాడు.

'ఆ క్యురేటరే పిచ్ను పరిశీలించి, రెండు జట్లకు అనుకూలంగా ఉండే పిచ్ను ఎంపిక చేస్తాడు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి సమస్యలు రాలేదు' అని తెలిపాడు. టీమిండియా మేనేజ్మెంట్ అడగడంతో కొత్త పిచ్ రెడీ చేయకుండా.. ఇంతకుముందు ఆడిన మరో పిచ్ను స్లో పిచ్గా రెడీ చేశారని వార్తలు వచ్చాయి.
అహ్మదాబాద్ వేదికగా జరిగే ఫైనల్లో కూడా భారత్ ఆడితే, అప్పుడు కూడా ఇలాంటి స్లో పిచ్నే తయారు చేస్తారంటూ ఈ వార్తల్లో పేర్కొన్నారు. దీనిపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేశారు. ఇక ఐసీసీ నిబంధనల ప్రకారం, పిచ్ను ఎంపిక చేయడమనేది ఆతిథ్యం ఇస్తున్న దేశం తీసుకునే నిర్ణయమే.
ఐసీసీ కూడా ఈ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చింది. తమ క్యురేటర్ కూడా పిచ్ను పరిశీలించాడని, ఆ తర్వాతనే పిచ్ను ఎంపిక చేయడం జరిగిందని స్పష్టం చేసింది. తాజాగా టీమిండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ కూడా ఈ కాంట్రవర్సీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇవన్నీ పిచ్చిరాతలంటూ ఈ న్యూస్ రాసిన జర్నలిస్టులపై మండిపడ్డాడు.