ఈ వరల్డ్ కప్లో అపజయమే లేకుండా సెమీఫైనల్స్ చేరుకున్న టీమిండియా.. కివీస్ను ఎదుర్కొనేందుకు రెడీ అవుతోంది. 2019లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచులో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే ప్రత్యర్థిని ఎదుర్కోవాల్సి రావడంతో టీమిండియా ఏమైనా ప్రత్యేకమైన ప్రాక్టీస్ చేస్తోందా? అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
దీనిపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ.. తాము కొత్తగా ఏమీ చేయబోమని, ఇప్పటి వరకు సక్సెస్ అయినా విధానంలోనే ఈ మ్యాచ్ కోసమూ రెడీ అవుతామని స్పష్టం చేశాడు. అయితే సెమీఫైనల్ కాబట్టి ఒత్తిడి మరింతగా ఉంటుందని, కానీ ఈ టీం దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటుందని ధీమా వ్యక్తం చేశాడు.

'సెమీఫైనల్ గేమ్ కూడా ఇంకో మ్యాచ్ అంతే.. అనడం కరెక్ట్ కాదు. అది సెమీస్ కాబట్టి కచ్చితంగా ఆ ఒత్తిడి ఉంటుంది. కానీ ఆ మ్యాచ్ కోసం మేం రెడీ అయ్యే విధానం ఏమీ మారదు. ఇప్పటి వరకు కలిసొచ్చిన ప్రాసెస్లోనే ఆ మ్యాచ్ కోసమూ రెడీ అవుతాం. ఆ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు' అని ద్రావిడ్ వెల్లడించాడు.
'అయితే ఇది మాకు చాలా ముఖ్యమైన మ్యాచ్. నాకౌట్ గేమ్ కాబట్టి కచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. దాన్ని మేం స్వీకరించక తప్పదు' అని వివరించాడు. ఇప్పటి వరకు ఈ మెగాటోర్నీలో టీమిండియా ఒత్తిడిని జయించిన విధానాన్ని కూడా ద్రావిడ్ మెచ్చుకున్నాడు. ఈ క్రమంలోనే నాకౌట్ మ్యాచ్కు రెడీ అయ్యే విధానంలో ఎలాంటి మార్పులు ఉండవని, కొత్తగా ఏం చేయబోమని స్పష్టం చేశాడు.
'ఇప్పటి వరకు మేం ఒత్తిడిని హ్యాండిల్ చేసిన విధానం చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. మా ప్రాక్టీస్ విషయంలో ఎలాంటి మార్పులూ ఉంటాయని నేను అనుకోవడం లేదు. ప్రస్తుతం టీంలో ఉన్న ఎనర్జీ, వైబ్ అద్భుతంగా ఉన్నాయి. ప్రస్తుతం మా ముందు ఉన్న మ్యాచ్ ఆడటం తప్ప మేం ఏం చేయలేం కదా. చక్కగా ప్లాన్ చేసుకొని, ప్రిపేర్ అయ్యి, బాగా ఆడటం తప్ప మనం ఏం చేయలేం' అని చెప్పుకొచ్చాడు.