క్రికెట్ ప్రపంచం మొత్తం రెండుగా విడిపోయేలా చేసిన ఘటన శ్రీలంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ను 'టైం అవుట్' చేయడం. బంగ్లాదేశ్, శ్రీలం మధ్య జరిగిన మ్యాచులో ఈ ఘటన జరిగింది. అంతకుముందు బ్యాటర్ అవుటైన రెండు నిమిషాల్లో కొత్త బ్యాటర్ రెడీ అవ్వాలి.
అలా రెడీ అవడంలో లంక వెటరన్ మాథ్యూస్ విఫలమయ్యాడు. దీన్ని గమనించిన బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ వెంటనే అప్పీల్ చేశాడు. అంపైర్లు కూడా ఏం చేయలేక మాథ్యూస్ను అవుట్గా ప్రకటించారు. దీంతో చాలా మంది ఫ్యాన్స్, నిపుణులు అందరూ కూడా బంగ్లాదేశ్ను తిట్టిపోశారు.

మ్యాచ్ గెలవాలంటే సొంత సత్తాతో గెలవాలని, అంతేకానీ ఇలా చీప్ ట్రిక్స్ ఫాలో అయ్యి గెలవడం అసలు లేదని అంటున్నారు. బంగ్లాదేశ్ సరిగా ఆడలేదని, ఏమాత్రం క్రీడాస్ఫూర్తి లేకుండా ప్రవర్తించిందని తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటనపై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా స్పందించాడు.
'ప్రతి ఒక్కరూ భిన్నంగా ఆలోచిస్తారు. మనమంతా వేరు వేరు మనుషులం. ఒక్కొక్కరి బుర్ర ఒక్కోలా ఆలోచిస్తుంది. వీటిలో తప్పు, ఒప్పు అనే విషయం ఏమీ ఉండదు. ఇలాంటి భిన్నాభిప్రాయాలు ఉండటం కూడా ఒకందుకు మంచిదే' అని ద్రావిడ్ తెలిపాడు. ఇలా మాథ్యూస్ విషయంలో వేరు వేరుగా మాట్లాడుతున్న వాళ్ల గురించి చెప్పాడు.
'కొందరు రూల్స్ను చివరి వరకు పాటించాలని అనుకుంటే.. దాని గురించి కంప్లయింట్ చేసే అవకాశం నీకుండదు. మనం ఎవరం కూడా అతనికి సాయం చేయలేం. ఎందుకంటే అవతలి వ్యక్తం కేవలం రూల్స్ మాత్రమే ఫాలో అవుతున్నాడు కదా. మనమే చేయ్యకపోవచ్చు. కానీ రూల్స్ ఫాలో అయ్యాడని అవతలి వ్యక్తిని తిట్టడం కరెక్ట్ కాదు' అని ద్రావిడ్ వివరించాడు.
కాగా, తను ఇలా అవుట్ అవడంపై మాథ్యూస్ చాలా అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం అతని సోదరుడు మాట్లాడుతూ.. షకీబ్ అల్ హసన్ కనుక శ్రీలంక వస్తే జనాలంతా కలిసి అతనిపై రాళ్లు విసురుతారని వార్నింగ్ కూడా ఇచ్చాడు.