Best Fielder: నెదర్లాండ్స్పై భారత జట్టు ఘనవిజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 410 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆ జట్టు కేవలం 250 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచులో 'ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్' మెడల్ కోసం టీమిండియా ఆటగాళ్లు గట్టిగా పోటీ పడ్డారు. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, కీపర్ కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ తదితరులు ఈ మెడల్ కోసం పోటీ పడ్డారు. చివరకు తన పోటీదారులను పక్కకు నెట్టిన సూర్యకుమార్ యాదవ్.. తన తొలి మెడల్ అందుకున్నాడు. చివరగా భారత్ ఆడిన మ్యాచులో రోహిత్ శర్మ ఈ మెడల్ అందుకున్న సంగతి తెలిసిందే.

నెదర్లాండ్స్ మ్యాచ్లో బెస్ట్ ఫీల్డర్ పేరును టీమిండియా ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్.. బిగ్ స్క్రీన్పై ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోలో ప్లేయర్ల గురించి దిలీప్ అన్న మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ మెడల్ కోసం గట్టి పోటీ ఇచ్చిన జడేజాను దిలీప్ తెగ మెచ్చుకున్నాడు.
'ఈ రోజు తనను గార్డియన్ అని పిలుస్తా. తన క్విక్ రిఫ్లెక్స్లు, షార్ప్ త్రోస్, బుల్లెట్ త్రోస్ అద్భుతంగా ఉన్నాయి' అని జడ్డూను కొనియాడాడు. అదే సమయంలో సూర్య కూడా తన మార్క్ చూపించాడని చెప్పాడు. 'ఎప్పుడూ యుద్ధానికి సిద్ధంగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితిలోనూ ఓటమి అంగీకరించడు. ఈ రోజు తను కూడా అద్భుతమైన రిఫ్లెక్స్లు చూపించాడు' అని సూర్యను ఆకాశానికి ఎత్తేశాడు.
ఇక రాహుల్ గురించి మాట్లాడుతూ.. 'మా చుక్కాని ఎప్పట్లాగే చక్కగా దారి చూపించింది. అదే సమయంలో వికెట్ల వెనుక తను చూపిస్తున్న స్కిల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో మాటల్లో చెప్పలేం' అని అన్నాడు. ఇక మెడల్ అందుకున్న సూర్యకుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశాడు. తన ఫీల్డింగ్ మెరుగవ్వడంలో దిలీప్ పాత్రను వివరించాడు. 'ఏడాది నుంచి నాకు దిలీప్ అండగా ఉన్నాడు. దానికి ఇదే రివార్డ్ అనుకుంటున్నా' అని చెప్పాడు.