నెదర్లాండ్స్పై భారత జట్టు ఘనవిజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 410 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో ఆ జట్టు కేవలం 250 పరుగులకే ఆలౌట్ అయిపోయింది. దీంతో భారత్ 160 పరుగుల తేడాతో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ మ్యాచులో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (128 నాటౌట్) అద్భుతమైన సెంచరీతో రాణించాడు. దీంతో అతన్ని ఫ్యాన్స్ తెగ మెచ్చుకున్నారు. అయితే ఫీల్డింగ్ సమయంలో అయ్యర్ చేసిన పని మాత్రం చాలా మంది ఫ్యాన్స్కు నచ్చలేదు. బౌండరీలైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ప్రేక్షకులపై అయ్యర్ నోరుపారేసుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. నెదర్లాండ్స్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో చూసిన కొందరు.. తన ఫీల్డింగ్లో పొరపాటు చేసిన అయ్యర్ ఆ కోపాన్ని ఫ్యాన్స్పై తీర్చుకున్నట్లు ఆరోపిస్తున్నారు. అయ్యర్ చేసిన పొరపాటు చూసిన కొందరు ఫ్యాన్స్ ఏవో కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.
దీంతో అయ్యర్కు కోపం వచ్చి, ఆ ఫ్యాన్స్పై ఇలా కోపం ప్రదర్శించినట్లు కొందరు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఈ వీడియో చూసిన చాలామంది అయ్యర్ ప్రవర్తన కరెక్ట్ కాదంటున్నారు. అదే సమయంలో ఫ్యాన్స్ కూడా అనవసరంగా నోరు పారేసుకోవడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఆటగాళ్లు మైదానంలో తీవ్రమైన ఒత్తిడిలో ఉంటారని, అలాంటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు చేయడం సహజమేనని వివరిస్తున్నారు.
కాగా, ఈ మ్యాచులో అయ్యర్తోపాటు కేఎల్ రాహుల్ (102) కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు. కేవలం 62 బంతుల్లోనే శతకం బాదిన రాహుల్.. వన్డే వరల్డ్ కప్లో భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ బాదిన ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో రోహిత్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు.