వరల్డ్ కప్లో తమ చివరి లీగ్ మ్యాచ్కు టీమిండియా రెడీ అయింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న ఈ మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ను టీమిండియా ఎదుర్కొంటోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. తాము ముందుగా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. టాస్ గురించి పెద్దగా ఆలోచించలేదని చెప్పాడు.
'టాస్ ఎలా ఉన్నా మేం ఇప్పటి వరకు చక్కగా రాణిస్తున్నాం. అన్ని విషయాల్లో బాక్సులు టిక్ చేసుకోవడానికి మాకు ఇది మంచి అవకాశం. ఈ మెగా టోర్నీలోమా ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నా. ఇంతలా అందరూ రాణిస్తుంటే కెప్టెన్ పని చాలా సులువు అయిపోతుంది. మా టీంలో ఎలాంటి మార్పులు లేవు' అని రోహిత్ తెలిపాడు.

పసికూనతో మ్యాచ్ కాబట్టి టీమిండియా ప్రయోగాలు చేస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆటగాళ్లందరికీ వారం రోజుల పాటు విశ్రాంతి దొరికిందని, కాబట్టి జట్టులో ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చని అంతకుముందే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా హింట్ ఇచ్చాడు. అతను చెప్పినట్లే ఎలాంటి మార్పులు లేకుండా బలమైన జట్టుతోనే టీమిండియా బరిలో దిగుతోంది.
'మేం ఓవరాల్గా ఈ టోర్నీలో బాగానే ఆడాం. రెండు మంచి విజయాలు కూడా సాధించాం. ఈ రోజు కూడా మంచి ప్రదర్శన చేయాలని అనుకుంటున్నాం. ఇప్పటి వరకు ఈ టోర్నీలో మేం చూసిన అతి భారీ క్రౌడ్ ఇదే. ఈ రోజు మా బెస్ట్ ఆట చూపిస్తాం. ఇండియాలో వరల్డ్ కప్ అంటే.. అంతకుమించిన మెగా ఈవెంట్ ఉండదు' అని నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ అన్నాడు.
'మేం ఇంకొంత బాగా ఆడాల్సింది. కానీ ఇప్పటి వరకు ఆడిన తీరు పట్ల సంతోషంగానే ఉన్నా. మేం కూడా టీంలో ఎలాంటి మార్పులు చేయలేదు' అని స్కాట్ చెప్పాడు. ఇక ఈ పిచ్ ఫుల్గా బ్యాటర్లకు అనుకూలంగా కనిపిస్తోంది. టీమిండియా కనుక సరిగ్గా ఆడితే ఈజీగా 400 పరుగుల స్కోరు చేస్తుందని నిపుణుల అంచనా. ఫ్యాన్స్ కూడా ఈ మ్యాచులోనే కోహ్లీ తన 50వ సెంచరీ పూర్తి చేయాలని అనుకుంటున్నారు.