ఈ వరల్డ్ కప్లో తను ఆడిన మొదటి మ్యాచులోనే స్టార్ పేసర్ మహమ్మద్ షమీ అదరగొట్టాడు. స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో శార్దూల్ను కూడా పక్కన పెట్టిన టీం మేనేజ్మెంట్.. షమీని జట్టులోకి తీసుకుంది. ఇలా వచ్చిన అవకాశాన్ని షమీ రెండు చేతులా అంది పుచ్చుకున్నాడు.
అద్భుతమైన బౌలింగ్తో న్యూజిల్యాండ్కు షాకిచ్చాడు. ఆ మ్యాచులో ఏకంగా ఐదు వికెట్లు తీసుకొని సత్తా చాటాడు. అంతగా రాణించినా సరే ఆ తర్వాతి మ్యాచులో షమీ ఆడటం అనుమానంగా మారింది. లక్నో వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరిగేది లక్నోలోని ఏకానా స్టేడియంలో. ఇక్కడి పిచ్ పూర్తిగా స్పిన్నర్లకు సహకరిస్తుంది.

ఈ నేపథ్యంలో షమీని మళ్లీ పక్కన పెట్టి అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను ఆడించాలని టీమిండియా భావిస్తోందట. లక్నో పిచ్పై అశ్విన్ చెలరేగుతాడని ఫ్యాన్స్ కూడా నమ్ముతున్నారు. అతనితోపాటు కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా కూడా ఈ మ్యాచులో చాలా కీలక పాత్ర పోషించనున్నారు. అయితే ఇలా షమీని పక్కన పెట్టేయడం ఎంత వరకు కరెక్ట్? అని టీమిండియాను నిలదీస్తున్నారు.
మరికొందరైతే షమీకి కాకుండా ఈ మ్యాచులో సిరాజ్కు రెస్ట్ ఇస్తే బెటర్ అని సలహా ఇస్తున్నారు. ఎందుకంటే సిరాజ్ బౌలింగ్లో కొంత పదును తగ్గిందని, కాబట్టి అతనికి కొంత విశ్రాంతి ఇస్తే.. తర్వాతి మ్యాచుల్లో మెరుగ్గా రాణించే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనా ఇంగ్లండ్తో మ్యాచులో టీమిండియా ఎవరిని పక్కన పెడుతుందనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
స్పిన్ పిచ్పై ముగ్గురు పేసర్లతో బరిలో దిగి ఎలాంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ముగ్గురిలో ఎవరో ఒకరిని పక్కన పెట్టడం మాత్రం గ్యారంటీ. అది ఎవరు? అని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. చివరి మ్యాచులో చెలరేగిన షమీని పక్కన పెడితే మాత్రం ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అవడం ఖాయమనే చెప్పాలి.