వరల్డ్ కప్లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు మరో అదురైన రికార్డును సాధించింది. లక్నోలోని ఏకానా స్టేడియంలో డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ను ఎదుర్కొన్న టీమిండియా.. అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో మెగా టోర్నీ హిస్టరీలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరింది.
ఆదివారం నాడు జరిగిన మ్యాచులో భారత్ చేతిలో ఇంగ్లండ్ ఏకంగా 100 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఇది ఈ టోర్నీలో భారత్ సాధించిన ఆరో విజయం. ఈ వరల్డ్ కప్లో మొదటి సారి టోటల్ను కాపాడుకునేందుకు వచ్చిన టీమిండియా అదరగొట్టింది. అందేకాదు, వరల్డ్ కప్లలో భారత్కు ఇది 59వ విజయం కావడం గమనార్హం.

దీంతో ఈ మెగా టోర్నీ హిస్టరీలో అత్యధిక విజయాలు సాధించిన జట్ల జాబితాలో రెండో స్థానానికి చేరింది. అగ్రస్థానంలో ఆస్ట్రేలియా (73 విజయాలు) కొనసాగుతోంది. ఈ క్రమంలోనే న్యూజిల్యాండ్ (58 విజయాలు)ను దాటేసింది. పాకిస్తాన్ ఈ టోర్నీ హిస్టరీలో 47 విజయాలు నమోదు చేయగా.. సౌతాఫ్రికా, వెస్టిండీస్ చెరో 43 మ్యాచుల్లో గెలిచాయి.
వరల్డ్ కప్లలో 65.56 విజయాలు పర్సంటేజీ ఉన్న భారత్.. అత్యధిక విజయాల శాతం ఉన్న జట్లలో కూడా రెండో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో కూడా 75 శాతం విజయాలతో ఆసీస్ తొలి స్థానంలో ఉంది. సౌతాఫ్రికా 61.43 శాతంతో మూడో స్థానంలో నిలిచింది. ఇక ఇంగ్లండ్పై భారత టాపార్డర్ కొంత తడబడింది.

అయినా సరే రోహిత్ శర్మ (87) అదరగొట్టాడు. చివర్లో సూర్యకుమార్ యాదవ్ (49) కూడా రాణించాడు. అయితే ఇంగ్లండ్ ముందు నిలిపిన 230 పరుగుల టార్గెట్ అంత గొప్పగా ఏం కనిపించలేదు. దీంతో భారత్ ఈ మ్యాచ్ ఓడిపోతుందేమో? అని ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. కానీ మహమ్మద్ షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ బంతితో చెలరేగారు.
ఇంగ్లండ్ బ్యాటర్లకు కనీసం ఊపిరి తీసుకునే అవకాశం కూడా ఇవ్వని వీళ్లు ముగ్గురూ.. అద్భుతంగా ఆడుతూ 9 వికెట్లు తీసుకున్నారు. షమీ నాలుగు వికెట్లతో చెలరేగగా.. బుమ్రా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు.