వరల్డ్ కప్లో జోరు మీదున్న టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ను డీకొట్టేందుకు రెడీ అవుతోంది. లక్నోలోని శ్రీ అటల్ బీహారీ వాజ్పేయీ ఏకానా స్టేడియం వేదికగా ఈ రెండు టీమ్స్ తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే తాము ఆడిన ఐదు మ్యాచుల్లో నెగ్గిన భారత్.. మరో మ్యాచ్ నెగ్గితే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది.
అదే సమయంలో వరుసగా నాలుగు మ్యాచులు ఓడిన ఇంగ్లండ్.. ఈ మ్యాచులో కూడా ఓడితే సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. ఈ క్రమంలో ఈ మ్యాచ్పై అభిమానుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఇక ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తుందని పెద్ద పేరు. కాబట్టి స్లో డెలివరీలు ఇక్కడ చాలా ప్రభావం చూపిస్తాయి.

అలాగే బ్యాటర్లు క్రీజులో కుదురుకోవడానికి సమయం పడుతుంది. టైం తీసుకుంటే మాత్రం తమదైన శైలిలో చివర్లో చెలరేగే అవకాశం ఉంటుంది. కానీ ఆరంభంలో మాత్రం ఈ పిచ్ వారిని పరీక్షిస్తుంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 229 పరుగులే కావడం గమనార్హం. ఇక రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 213 పరుగులే.
అంటే టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఇక్కడ ఏడు వన్డే మ్యాచులు జరగ్గా.. వాటిలో ఛేజింగ్ టీమ్స్ కేవలం మూడు మ్యాచుల్లోనే నెగ్గడం గమనార్హం. భారత్ ఈ స్టేడియంలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. అది కూడా గతేడాది సౌతాఫ్రికాతో. ఈ మ్యాచులో టీమిండియా ఓడిపోయింది.
ఇంగ్లండ్ ఇప్పటి వరకు ఈ స్టేడియంలో ఆడనేలేదు. కాబట్టి అది కూడా ఆ టీంకు సమస్యగా మారే అవకాశం ఉంది. ఇక ఇక్కడ వర్షం పడే అవకాశమే లేదని వాతావరణ శాఖ చెప్తోంది. ఉష్ణోగ్రతలు కూడా 18-31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని సమాచారం. ఆకాశంలో పెద్దగా మబ్బులు కూడా ఉండవని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫ్యాన్స్ ఫుల్ మ్యాచ్ చూడటం గ్యారంటీ అన్నమాట.