ఈ ఏడాది వరల్డ్ కప్లో ఇప్పటి వరకు 28 మ్యాచులు జరిగాయి. ట్రోఫీ కోసం తలపడుతున్న జట్లు ఈ మ్యాచుల్లో తమ వంద శాతం సత్తా చూపించాయి. ఎలాగైనా సెమీస్ చేరాలని, అక్కడ కూడా గెలిచి ఫైనల్లో సత్తా చాటాలని ఈ జట్లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ఈ మెగాటోర్నీలో గెలిచే మ్యాచులు కేవలం ఇక్కడి వరకే పరిమితం కాదు.
2025లో మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ తిరిగొస్తుంది. దానిలో ఆడాలంటే ఈ వరల్డ్ కప్లో రాణించాల్సి ఉంటుంది. ఈ వరల్డ్ కప్లో టాప్-7 స్థానాల్లో నిలిచిన జట్లు చాంపియన్స్ ట్రోఫీకి నేరుగా అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీ జరిగేది పాకిస్తాన్లో కాబట్టి, ఆ టీం కూడా అర్హత సాధిస్తుంది. ఇలా ఛాంపయిన్స్ ట్రోఫీ ఆడే జట్లను డిసైడ్ చేయాలని ఐసీసీ నిర్ణయించింది.

2021లో ఐసీసీ సమావేశంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. అయితే చాలా క్రికెట్ బోర్డులకు ఈ క్వాలిఫికేషన్ విషయం తెలియదట. ఈ క్రమంలో ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమయ్యే ప్రమాదంలో పడింది. ఇప్పటి వరకు ఐదు వరల్డ్ కప్ మ్యాచులు ఆడిన ఈ టీం.. కేవలం ఒక్క విజయమే సాధించిన సంగతి తెలిసిందే.
కాబట్టి బట్లర్ సేన కనుక ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడాలంటే.. మిగతా మూడు మ్యాచుల్లో సత్తా చాటాల్సి ఉంటుంది. లేదంటే ఛాంపియన్స్ ట్రోఫీ బెర్తు కూడా పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అలా జరగకూడదంటే.. ఇంగ్లండ్ మిగతా మ్యాచుల్లో తమ ఎ-గేమ్ చూపించాల్సి ఉంటుంది. ఇక గతంతో పోలిస్తే ఈ సెలెక్షన్ ప్రక్రియ కొత్తదే అని చెప్పాలి.
చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ జరిగింది 2017లో. ఆ టోర్నీలో ఆడే జట్లను వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా ఎంపిక చేశారు. 2013 నుంచి 2017 వరకు ఇదే పద్ధతిని అనుసరించారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో తొలి ఎనిమిది ర్యాంకుల్లో నిలిచిన జట్లకు ఛాంపియన్స్ ట్రోఫీ ఆడే అవకాశం దక్కేది. కానీ ఈసారి మాత్రం ఈ విధానాన్ని మార్చడం గమనార్హం.