బంగ్లాదేశ్తో జరిగే వరల్డ్ కప్ మ్యాచు కోసం టీమిండియా రెడీ అవుతోంది. ఇటీవలి కాలంలో భారత్కు బంగ్లాదేశ్ బాగానే షాకులిస్తూ వస్తోంది. దీంతో ఈ మ్యాచ్పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. అదే సమయంలో కొందరు ప్లేయర్లు మాత్రం కొన్ని కీలక రికార్డులు బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్నారు. వాళ్లెవరంటే?
గిల్ అడుగు దూరంలో..:వరల్డ్ కప్ ముందు డెంగ్యూతో బారిన పడిన టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్.. పాకిస్తాన్తో మ్యాచులో జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మ్యాచులో దురదృష్టవశాత్తూ పెద్దగా స్కోరు చేయకుండానే పెవిలియన్ చేరాడు.

ఇప్పటి వరకు వన్డేల్లో 1933 పరుగులు చేసిన గిల్.. 2 వేల పరుగుల మైలురాయి అందుకోవడానికి 67 పరుగుల దూరంలో ఉన్నాడు. అతను కనుక బంగ్లాపై ఈ మైలురాయి అందుకుంటే.. అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన బ్యాటర్గా సఫారీ లెజెండ్ హషీమ్ ఆమ్లా (40 ఇన్నింగ్సులు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు.
రెహ్మాన్ కూడా.:బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కూడా ఒక అరుదైన వరల్డ్ కప్ రికార్డుకు చేరువలో ఉన్నాడు. సరిగ్గా వరల్డ్ కప్ ముందు బెస్ట్ ఫామ్ అందుకున్న ఈ లెఫ్ట్ ఆర్మ్ పేసర్.. మూడు మ్యాచుల్లో రెండు వికెట్లతో రాణించాడు. దీంతో అన్ని వరల్డ్ కప్లలో కలిపి అతను తీసుకున్న వికెట్ల సంఖ్య 22కు చేరింది.
కేవలం 11 ఇన్నింగ్సుల్లో అతను ఈ వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచులో కనుక ముస్తాఫిజుర్ మూడు వికెట్లు తీసుకుంటే.. అత్యంత వేగంగా వరల్డ్ కప్లలో 25 వికెట్లు తీసుకున్న ఘనత సాధిస్తాడు. బంగ్లా కెప్టెన్ షకీబల్ హసన్ గత వరల్డ్ కప్లో తన 23వ ఇన్నింగ్సులో ఈ రికార్డు సాధించాడు.
కోహ్లీ 77 పరుగులు చేస్తే..:
టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ కూడా అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం 566 ఇన్నింగ్సులు ఆడిన కోహ్లీ.. 26 వేల అంతర్జాతీయ పరుగుల మైలురాయి చేరుకోవడానికి కేవలం 77 పరుగుల దూరంలో ఉన్నాడు. క్రికెట్ దేవుడు సచిన్ కూడా ఈ ఘనత సాధించడానికి 600 ఇన్నింగ్సులు తీసుకున్నాడు.
ఈ మ్యాచులో కనుక కోహ్లీ ఈ మార్కు సాధిస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో 26 వేల పరుగులు చేసిన నాలుగో బ్యాటర్గా నిలుస్తాడు. అతని కన్నా ముందు సచిన్, కుమార్ సంగక్కర, రికీ పాంటింగ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.