World Cup Final: వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన టీమిండియా.. సూపర్ విజయాలతో ఫైనల్ చేరుకుంది. అదే సమయంలో మెగాటోర్నీ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా కూడా అద్భుతమైన విజయాలతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ రెండు జట్లు కూడా నవంబరు 19 వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ చాలా ఏర్పాట్లు చేస్తోంది. భారత ప్రధాని మోదీ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వస్తారని సమాచారం. అలాగే ఆస్ట్రేలియా ప్రధానిని కూడా ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ కోసం బీసీసీఐ ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత వాయుసేన కూడా ఈ ఏర్పాట్లలో పాలుపంచుకుంటోంది.

ఈ ఫైనల్కు ముందు జరిగే వేడుకల్లో భారత వాయుసేనకు చెందిన 'సూర్య కిరణ్' బృందం.. గగనతలంలో విన్యాసాలు చేయనుంది. అంతేకాదు, ఇండియన్ ఐడల్ విన్నర్, తెలుగు సింగర్ శ్రీరామచంద్ర కూడా ఈ వేడుకల్లో తన పాటలతో అందర్నీ అలరించనున్నాడు. అతని పాటలు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ ఆధ్వర్యంలో ఆటపాటల కార్యక్రమాలను బీసీసీఐ ఏర్పాటు చేసింది. అలాగే ఎప్పట్లాగే ఇన్నింగ్స్ బ్రేక్లో లేజర్ షో అందర్నీ అలరించనుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే 1200 డ్రోన్స్ ఆకాశంలోకి వెళ్లి గెలిచిన జట్టు పేరును గగనతలంలో లిఖిస్తాయి. అలాగే టోర్నీ ముగింపు వేడుకల్లో ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా ఆడిపాడుతుందని తెలుస్తోంది.
ఇక భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ ఫైనల్ కోసం అభిమానులు తెగ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా టీమిండియా ఫ్యాన్స్.. 2003లో కూడా ఈ రెండు జట్లే ఫైనల్ చేరిన విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. కానీ ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా భారీ స్కోరు సాధించి, ఘనవిజయం నమోదు చేసింది. ఇప్పుడు ఆ మ్యాచ్కు ప్రతీకారం తీర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.