Anti-India Slogans: వరల్డ్ కప్ ఫైనల్ ముగిసి పది రోజులు గడిచిపోయింది. అయినా సరే ఆ ఓటమి బాధ నుంచి భారత అభిమానులు ఇంకా కోలుకోలేదు. నవంబరు 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆశించినంత స్కోరు చేయలేకపోయింది.
శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ విఫలం అవడంతో కేఎల్ రాహుల్పై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో అతను చాలా నెమ్మదిగా ఆడాడు. ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ పరమ చెత్తగా ఆడటంతో భారత జట్టు కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 43 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది.

ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఓటమి చూసిన టీమిండియా అభిమానులు ఇప్పటికీ బాధ పడుతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్లో కొందరు యువకులు చేసిన పని చాలామందికి ఆగ్రహం కలిగించింది.
ఇక్కడి ఏడుగురు కుర్రాళ్లు.. భారత్ ఓడిపోయిందని సంతోషం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ విషయం తెలిసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సదరు కుర్రాళ్లపై యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ యువకులు సంబరాలు చేసుకున్న వీడియో ఆధారంగా పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
యూఏపీఏ చట్టం కింద అరెస్టయితే.. మ్యాగ్జిమమ్ ఏడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఒక వ్యవసాయ యూనివర్సిటీకి చెందిన ఈ కుర్రాళ్లు భారత్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. పాకిస్తాన్, ఆస్ట్రేలియాకు మద్దతుగా స్లోగన్స్ చెప్పారు. దీనిపై మరో విద్యార్థి ఫిర్యాదు చేయడంతో పోలీసులు స్పందించారు.