World Cup 2023: వరల్డ్ కప్లో అద్భుతంగా ఆడిన భారత జట్టు.. ఫైనల్లో మాత్రం తడబడింది. ఆ ఓటమి బాధ నుంచి భారత అభిమానులు ఇంకా కోలుకోలేదు. నవంబరు 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆశించినంత స్కోరు చేయలేకపోయింది.
శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ విఫలం అవడంతో కేఎల్ రాహుల్పై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో అతను చాలా నెమ్మదిగా ఆడాడు. ఇక చివర్లో సూర్యకుమార్ యాదవ్ పరమ చెత్తగా ఆడటంతో భారత జట్టు కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ లక్ష్యాన్ని ఆసీస్ కేవలం 43 ఓవర్లలోనే ఛేజ్ చేసేసింది.

ట్రావిస్ హెడ్ అద్భుత శతకంతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. దీంతో భారత్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్ తర్వాత భారత డ్రెస్సింగ్ రూంలోకి వెళ్లిన ప్రధాని మోదీ.. ఆటగాళ్లను అక్కున చేర్చుకొని ఓదార్చారు. దీనిపై తాజాగా టీమిండియా మాజీ లెజెండ్ కపిల్ దేవ్ స్పందించాడు.
మోదీ ఇలా ఆటగాళ్లను కౌగిలించుకొని ఓదార్చడంపై పలువురు ఫ్యాన్స్.. పలు రకాలుగా స్పందించారు. అయితే కపిల్ మాత్రం ప్రధాని చేసిన పని చాలా గొప్పదని మెచ్చుకున్నాడు. 'ప్రధాన మంత్రి ఓదార్చకపోతే? ఇంక జట్టును ఎవరు ఓదారుస్తారు? ఆయన ఈ దేశంలో నెంబర్ వన్ మనిషి. అలాంటి వ్యక్తి మద్దతు ఇస్తే చాలా బాగుంటుంది' అని చెప్పాడు.
కపిల్ టీంమేట్ కీర్తి ఆజాద్ ఇదే విషయంపై అంతకుముందు విభిన్నంగా స్పందించాడు. 'ఏ టీంకైనా డ్రెస్సింగ్ రూం అనేది చాలా పవిత్రమైనది. ప్లేయర్లు, సహాయక సిబ్బంది మినహా ఎవరూ లోపలకు రాకుండా ఐసీసీ అడ్డుకుంటుంది. ప్రధాని కూడా ప్లేయర్లను డ్రెస్సింగ్ రూం బయటే కలవాల్సింది' అన్నాడు. దీనికే కపిల్ దేవ్ కౌంటర్ ఇచ్చాడు.