INDvsAUS అద్భుతంగా సాగిన వన్డే వరల్డ్ కప్ ముగింపు దశకు చేరుకుంది. టోర్నీలో ఫైనల్ మాత్రమే మిగిలింది. టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరుకున్నాయి. ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ అనగానే.. 2003లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ను అందరూ గుర్తుచేసుకుంటున్నారు. ప్రస్తుత ఫామ్ను బట్టి చూస్తే టీమిండియానే ఈ మ్యాచ్లో ఫేవరెట్ అని అందరూ అంటున్నారు.
ఇలాంటి సమయంలో ఐసీసీ ఈ మ్యాచ్ అఫీషియల్స్ జాబితాను విడుదల చేసింది. అది చూసిన తర్వాత ఫ్యాన్స్లో టెన్షన్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ లిస్టులో ఆన్ఫీల్డ్ అంపైర్గా రిచర్డ్ కెటిల్బరో ఉన్నాడు. టీమిండియా నాకౌట్స్ చేరిన మ్యాచుల్లో అతను అంపైర్గా ఉన్న ప్రతిసారీ భారత్ ఓటమిపాలైంది. ఇదే విషయంపై ఇప్పుడు ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు.

నవంబరు 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో రిచర్డ్ కెటిల్బరో, రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఇద్దరూ ఆన్ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. మ్యాచ్ అంపైర్గా ఆండీ పైక్రాఫ్ట్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. మూడో అంపైర్గా జోల్ విల్సన్ ఉండగా.. ఫోర్త్ అంపైర్గా క్రిస్ గాఫనీని నియమించినట్లు ఐసీసీ ప్రకటించింది.
ఈ మ్యాచులో మిగతా అంపైర్లు ఎవరితోనూ భారత అభిమానులకు ఎలాంటి సమస్య లేదు. కానీ కెటిల్బరో పేరు వినగానే వారికి టెన్షన్ పెరిగిపోతోంది. ఎందుకంటే 2013 తర్వాత భారత జట్టు నాకౌట్స్లో ఓడిన మ్యాచుల్లో అత్యధిక భాగం ఓటముల్లో అతనే అంపైర్. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో శ్రీలంక చేతిలో భారత్ ఓడింది. ఆ మ్యాచ్లో కెటిల్బరో, ఇయాన్ గోల్డ్ అంపైర్లుగా ఉన్నారు.
ఇక 2015 వన్డే వరల్డ్ కప్లో కూడా ఆసీస్తో జరిగిన సెమీస్ మ్యాచులో భారత్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచులో కెటిల్బరో, కుమార ధర్మసేన అంపైర్లుగా ఉన్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడినప్పుడు కూడా కెటిల్బరో, మరాస్ ఎరాస్మస్ అంపైరింగ్ చేశారు.
అంతేకాదు, 2019 వన్డే వరల్డ్ కప్లో న్యూజిల్యాండ్ చేతిలో భారత్ ఓడిన మ్యాచులో కూడా కెటిల్బరోనే అంపైర్. అతనితోపాటు రిచర్డ్ ఇల్లింగ్వర్త్ ఆ మ్యాచ్లో ఆన్ఫీల్డ్ అంపైర్లుగా ఉన్నారు. ఇప్పుడు ఫైనల్కు మళ్లీ వాళ్లిద్దరే అంపైర్లు అనగానే ఫ్యాన్స్ ఈ సెంటిమెంట్ చూసి భయపడుతున్నారు. అయితే ప్రస్తుతం ఫామ్ను బట్టి చూస్తే టీమిండియానే గెలుస్తుందని ఆశిద్దాం.