వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన టీమిండియా.. సూపర్ విజయాలతో ఫైనల్ చేరుకుంది. అదే సమయంలో మెగాటోర్నీ ఆరంభంలో తడబడినా ఆ తర్వాత పుంజుకున్న ఆస్ట్రేలియా కూడా అద్భుతమైన విజయాలతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఈ రెండు జట్లు కూడా నవంబరు 19 వ తేదీన నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వరల్డ్ కప్ ట్రోఫీ కోసం తలపడనున్నాయి.
ఈ మ్యాచ్ కోసం బీసీసీఐ చాలా ఏర్పాట్లు చేస్తోంది. భారత ప్రధాని మోదీ కూడా ఈ మ్యాచ్ చూసేందుకు వస్తారని సమాచారం. అలాగే ఆస్ట్రేలియా ప్రధానిని కూడా ఈ మ్యాచ్ చూసేందుకు రావాలని ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఫైనల్ కోసం బీసీసీఐ ఎన్నో ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే భారత వాయుసేన కూడా ఈ ఏర్పాట్లలో పాలుపంచుకుంటోందట.

ఈ ఫైనల్కు ముందు జరిగే వేడుకల్లో భారత వాయుసేనకు చెందిన 'సూర్య కిరణ్' బృందం.. గగనతలంలో విన్యాసాలు చేయనుంది. ఈ విషయాన్ని భారత వాయుసేన ప్రకటించింది. ఈ బృందంలో 9 హాక్ ఎయిర్క్రాఫ్ట్లు ఉంటాయట ఈ 9 విమానాలు కలిసి అద్భుతమైన విన్యాసాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తాయని తెలుస్తోంది.
ఇక ఈ టోర్నీ లీగ్ దశలో ఓటమి లేకుండా సెమీస్ చేరిన భారత జట్టు.. వాంఖడే వేదికగా జరిగిన సెమీఫైనల్లో 70 పరుగుల తేడాతో కివీస్ను చిత్తు చేసింది. కోహ్లీ, అయ్యర్ సూపర్ సెంచరీలతో చెలరేగారు. అనంతరం మహమ్మద్ షమీ నిప్పులు చెరగడంతో కివీస్ బ్యాటర్లు తేలిపోయారు. అతను ఏకంగా 7 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
తాజాగా ఈడెన్ గార్డెవ్స్ వేదికగా జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచులో ఆస్ట్రేలియా పోరాడి గెలిచింది. సౌతాఫ్రికా నిర్దేశించిన 213 పరుగుల టార్గెట్ను ఛేదించడంలో కంగారూలకు మంచి ఆరంభమే దక్కింది. కానీ దాన్ని ఉపయోగించుకోవడంలో ఆసీస్ విఫలమైంది. అయితే ఎట్టకేలకు 47.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్లో అడుగు పెట్టింది.