World Cup 2023: వరల్డ్ కప్ ఫైనల్కు సమయం దగ్గరపడింది. ఈ క్రమంలో కివీస్ను ఓడించిన టీమిండియా ముందుగా ఫైనల్లో అడుగు పెట్టగా.. సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీతో ఆస్ట్రేలియా కూడా ఫైనల్లోకి దూసుకొచ్చింది. అయితే ఆస్ట్రేలియా ఇంకా అంత బలంగా కనిపించడం లేదని టీమిండియా లెజెండ్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు.
సౌతాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ చూసిన తర్వాత.. ఇంకా ఆసీస్ తమ బెస్ట్ క్రికెట్ ఆడటం లేదని గంభీర్ అన్నాడు. సఫారీలపై 213 పరుగుల ఛేజ్ను ఆసీస్ తలకు మించిన భారంగా మార్చుకుంది. ట్రావిస్ హెడ్ (68), డేవిడ్ వార్నర్ (29) ఇచ్చిన మంచి ఆరంభాన్ని సరిగా ఉపయోగించుకోలేకపోయింది.

చివర్లో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ పట్టుదలగా ఆడి 8వ వికెట్కు 22 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంపై మాట్లాడిన గంభీర్.. 'సెమీఫైనల్లో ఆసీస్ జట్టు తమ బెస్ట్ ఆటతీరు కనబరిచిందని నేను అనుకోవడం లేదు. వాళ్లు ఇంకా చాలా బలహీనంగానే కనిపిస్తున్నారు' అని తేల్చిచెప్పాడు.
'అయితే నాకౌట్ మ్యాచులు గెలవడం ఎలాగో ఆసీస్కు బాగా తెలుసు. కాబట్టి ఫైనల్లో గెలవాలంటే భారత జట్టు కచ్చితంగా తమ బెస్ట్ ఆటను కనబరచాల్సిందే. ఈ లీగ్లో పది మ్యాచుల్లో భారత్ తమ ఎ-గేమ్ ఆడింది. అహ్మదాబాద్లో ఆసీస్ను ఎదుర్కొనే సమయంలో భారత్ ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటుందని కచ్చితంగా చెప్తా' అని గంభీర్ పేర్కొన్నాడు.
కొంత తడబడుతున్నా కూడా ఆసీస్ను తక్కువ అంచనా వేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే లీగ్ ఆరంభంలో రెండు మ్యాచులు ఓడిన ఆసీస్.. ఆ తర్వాత ఓటమి లేకుండానే దూసుకొచ్చింది. వరుసగా 8 విజయాలతో ఫైనల్లో అడుగు పెట్టింది. ఇది ఆసీస్కు 8వ వరల్డ్ కప్ ఫైనల్ కావడం గమనార్హం. భారత జట్టు ఇప్పటి వరకు పది విజయాలు సాధించి ఫైనల్లో నిలిచింది.