World Cup 2023: ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్ కనబరిచిన టీమిండియా.. ఫైనల్కు దూసుకెళ్లింది. ఒకరు, ఇద్దరు అని కాకుండా జట్టులో అందరూ అద్భుతంగా రాణిస్తూ విజయం కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి స్టార్లను అందరూ తెగ మెచ్చుకుంటున్నారు.
కానీ కోహ్లీ, రోహిత్, షమీ కాదని.. టీమిండియా అసలు సిసలు హీరో శ్రేయాస్ అయ్యర్ అని మాజీ లెజెండ్ గౌతం గంభీర్ అంటున్నాడు. ప్రస్తుతం ఈ వరల్డ్ కప్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో అయ్యర్ ఏడో స్థానంలో ఉన్నాడు. పది మ్యాచుల్లో కలిపి 506 పరుగులు చేశాడు.

టోర్నీ ఆరంభంలో తడబడిన అయ్యర్.. చివరి ఐదు మ్యాచుల్లో చెలరేగాడు. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు, రెండు సెంచరీలు బాదాడు. చివరి నాలుగు మ్యాచుల్లో అతను వరుసగా 82, 77, 128 నాటౌట్, 105 స్కోర్లు నమోదు చేశాడు. ఈ క్రమంలోనే అతన్ని గంభీర్ ఆకాశానికి ఎత్తేశాడు.
'టీమిండియాలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ ఎవరైనా ఉన్నారంటే అతను శ్రేయాస్ అయ్యరే. ఈ టోర్నీలో అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. మిడిల్ ఓవర్లలో తన బ్యాటింగ్తో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు' అని గంభీర్ చెప్పాడు. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో ఉన్న అయ్యర్.. ఒక వరల్డ్ కప్లో 500పైగా పరుగులు చేసిన నాలుగో ఇండియన్ బ్యాటర్గా నిలిచాడు.
ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన నాలుగో భారత బ్యాటర్గా నిలిచాడు. ఈ ఏడాది ఆరంభంలో వెన్నుసమస్యతో బాధ పడిన అయ్యర్.. ఆరు నెలలకుపైగా ఆటకు దూరమయ్యాడు. ఆ తర్వాత రీఎంట్రీలో కొంత తడబడి విమర్శలపాలయ్యాడు. కానీ సరిగ్గా వరల్డ్ కప్ నాకౌట్స్ సమయానికి సూపర్ ఫామ్ అందుకున్నాడు. ఫైనల్లో ఆసీస్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో కూడా అతనే చాలా కీలకం కానున్నాడు.