క్రికెట్పై కొంత మంది ఆటగాళ్ల ప్రభావాన్ని అంత ఈజీగా తొలగించలేం. అలాంటి వారిలో టీమిండియా మాజీ సారధి ఎంఎస్ ధోనీ ఒకడు. తనదైన కెప్టెన్సీతోపాటు అద్భుతమైన మోటివేషన్ ఇవ్వడంలో కూడా ధోనీకి పోటీ లేదు. విజయాలను ఆస్వాదిస్తూనే పరాజయాన్ని హుందాగా స్వీకరించే గుణం కూడా ధోనీకి ఉంది.
ఇలాగే గెలుపోటముల గురించి ధోనీ ఒకానొక సందర్భంలో చెప్పిన ఒక మాట.. ఇప్పటికీ టీమిండియాలో స్ఫూర్తి నింపుతూనే ఉంది. దాన్ని భారత జట్టు తమ డ్రెస్సింగ్ రూంలో ఉంచుకొని ఇన్స్పైర్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మైదానంలో మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలంటూ ధోనీ అన్న మాటలు ఈ పోస్టర్పై ఉన్నాయి.

'మైదానంలో వంద శాతం కన్నా ఎక్కువ కష్టపడాలని నేను నమ్ముతా. మైదానంలో అంత గొప్ప కమిట్మెంట్ చూపిస్తే మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా నేను పెద్దగా పట్టించుకోను. ఆ కమిట్మెంట్ చూపించడమే నా దృష్టిలో విజయం' అని ఎంఎస్ ధోనీ ఒకానొక సందర్భంలో చెప్పాడు. ఈ కొటేషన్ ఉన్న పోస్టర్ను అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఉంచారు.
ఇది చూసిన ధోనీ ఫ్యాన్స్ అయితే మాజీ కెప్టెన్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇలా టీంలో స్ఫూర్తి నింపడంలో ధోనీ తర్వాతే ఎవరైనా అంటున్నారు. అలాగే ధోనీ పలు సందర్భాల్లో చేసిన కొన్ని వ్యాఖ్యలను, సదరా కామెంట్స్ను కూడా నెట్టింట పంచుకుంటున్నారు. దీంతో మళ్లీ సోషల్ మీడియాలో ధోనీ వైరల్ అవుతున్నాడు.
ఇక వరల్డ్ కప్లో తమ మొదటి మ్యాచులో ఆస్ట్రేలియాపై ఉత్కంఠ భరిత విజయం సాధించిన టీమిండియా.. రెండో మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ను ఎదుర్కొంటోంది. ఢిల్లీ వేదికగా జరిగే ఈ మ్యాచులో కూడా భారత్ ఫేవరెట్గా బరిలో దిగుతోంది. ఇక ఆ తర్వాత 14వ తేదీన అందరూ ఎదురు చూస్తున్న భారత్, పాక్ మ్యాచ్ జరుగుతుందన్న సంగతి తెలిసిందే.