అహ్మదాబాద్: ఇంకొన్ని గంటలు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
ఈ హైఓల్టేజ్ మ్యాచ్ను తిలకించడానికి అభిమానులు పోటెత్తారు. లక్షా 30 మంది అభిమానులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఈ ఉదయం నుంచే నరేంద్ర మోదీ స్టేడియానికి పోటెత్తారు ఫ్యాన్స్. గుంపులు గుంపులుగా చేరుకున్నారు. స్టేడియానికి దారి తీసే మార్గాలన్నీ రద్దీతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

ఒక్కో ప్లేయర్ అభిమాని.. ఒక్కో రకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, లోకల్ బాయ్ హార్దిక్ పాండ్యా.. ఫ్యాన్స్ ప్లకార్డులు, ఫొటోలు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో కనిపించాయి. స్టేడియం పరిసరాల్లో వారి కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను సైతం కట్టారు అభిమానులు.
వారందరి కంటే- టీమిండియా డాషింగ్ ఓపెనర్ శుభ్మన్ గిల్ అభిమానులు ఇంకాస్త వెరైటీగా కనిపించారు. దోమలను తిడుతూ రాసిన ఓ ప్లకార్డును ప్రదర్శించారు. ఈ మ్యాచ్ చూడటానికి బెంగళూరు నుంచి అహ్మదాబాద్కు వచ్చిన ఫ్యాన్స్ వారు. Damn you Mosquito, Miss you Gill.. అని రాసిన ప్లకార్డును తమ వెంట తీసుకొచ్చారు. దోమలు కట్టడం వల్లే గిల్ డెంగ్యూ బారిన పడ్డాడని, అతని బ్యాటింగ్ను మిస్ అయ్యామనీ చెప్పుకొచ్చారు.
వరల్డ్ కప్ ఆడుతోన్న టీమిండియాలో శుభ్మన్ గిల్కు చోటు దక్కినప్పటికీ- ఇంకా అరంగేట్రం చేయలేదతను. టోర్నమెంట్ ఆరంభానికి ముందు జ్వరం బారిన పడ్డాడు. డెంగ్యూ ఫీవర్తో సతమతం అయ్యాడు. ఓ రెండురోజుల పాటు చెన్నై ఆసుపత్రిలోనూ అడ్మిట్ అయ్యాడు శుభ్మన్ గిల్.

కోలుకున్న తరువాత అహ్మదాబాద్కు చేరుకున్నాడు. జట్టుతో కలిసి నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. చెమటోడ్చాడు. ఆ సమయంలో ఫుల్ జోష్లో కనిపించాడు గిల్. నెట్స్లో స్వేచ్ఛగా కదిలాడు. సాధికారతతో షాట్లు ఆడాడు. పూర్తి ఫిట్నెస్తో సాధించాననే సంకేతాలను పంపించాడు. అయినప్పటికీ- పాకిస్తాన్పై జరిగే నేటి మ్యాచ్లో అతను ఆడటం అనుమానమే.
అది అతని అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేసినట్టయింది. అతనికి డెంగ్యూ సోకడం, అనారోగ్యం పాలవడం, చివరికి ఆసుపత్రిలోనూ అడ్మిట్ కావాల్సిన దుస్థితి ఏర్పడటానికి ఈ దోమలే కారణమని తేల్చేశారు. అందుకే దోమలను నిర్మూలించాలంటూ పిలుపునిచ్చారు. దోమలపై దండయాత్ర చేద్దామంటూ పిలుపిచ్చారు.