అహ్మదాబాద్: ప్రపంచ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్కు మించి అనిపించేలా జరిగే ఈ పోరులో విజయం సాధించడానికి రెండు జట్లు సన్నద్ధం అయ్యాయి.
వరల్డ్ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్పై భారత్కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్లల్లోనూ విజయఢంకా మోగించింది. వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. అన్నిసార్లూ భారత్దే పైచేయి అయింది.

ఈ మ్యాచ్కు ముందు టీమిండియా మాజీ ఓపెనర్, భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడు గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మ్యాచ్ చూడటానికి ఈ ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారాయన. కొద్దిసేపటి కిందటే స్టేడియానికి వచ్చారు. ఈ సందర్భంగా తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు గంభీర్.
పాకిస్తాన్ కూడా బలమైన జట్టేనని, దీన్ని ఎదుర్కొనడంలో ప్రత్యర్థి జట్లు అప్రమత్తంగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇందుకు భారత్ కూడా మినహాయింపు కాదని పేర్కొన్నారు. పాకిస్తాన్ టీమ్లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఎలాంటి పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే సామర్థ్యం వారికి ఉందని అన్నారు.
శ్రీలంకపై పాకిస్తాన్ ఓపెనర్ అబ్దుల్లా షఫిక్- 113, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్- 131 పరుగులతో లంక బౌలర్లపై చెలరేగిన విషయాన్ని గౌతమ్ గంభీర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పాకిస్తాన్ను ఎదుర్కొనే విషయంలో భారత జట్టు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటోన్నానని వ్యాఖ్యానించారు.
ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలిచినా గట్టి పోటీ తప్పదని, విజయాన్ని సాధించడానికి చివరి ఓవర్ వరకూ నాణ్యమైన క్రికెట్ ఆడాల్సి ఉంటుందని గౌతమ్ గంభీర్ అన్నారు. ఈ వరల్డ్ కప్లో భారీ స్కోర్లు నమోదవుతున్నాయని, ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంటుందని ఆయన అంచనా వేశారు.