అహ్మదాబాద్: ప్రపంచ కప్ 2023లో భాగంగా భారత్- పాకిస్తాన్ మధ్య హైఓల్టేజ్ మ్యాచ్ ఇంకొన్ని గంటల్లో మొదలు కాబోతోంది. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది. మ్యాచ్కు మించి అనిపించేలా జరిగే ఈ పోరులో విజయం సాధించడానికి రెండు జట్లు సన్నద్ధం అయ్యాయి.
ఈ మ్యాచ్ చూడటానికి వచ్చే అభిమానులకు అహ్మదాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. నరేంద్ర మోదీ స్టేడియం లోపలికి ప్రేక్షకులు ఎవరూ గుట్కా గానీ, పాన్ మసాలా గానీ తీసుకు రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. వీటిని తీసుకుని వచ్చే వారిని వెనక్కి పంపిస్తామనీ హెచ్చరించారు.

గుజరాత్ ప్రభుత్వం గత సంవత్సరం నికోటిన్ బేస్డ్ గుట్కా, పాన్ మసాలాను నిషేధించిన విషయాన్ని పోలీసులు గుర్తు చేశారు. స్టేడియంలో వాటిని తినడం, ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయడాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. గుట్కాలను నమిలే వారిపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు.
ఇదే విషయంపై అటు గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ కూడా అభిమానుల కోసం ప్రత్యేకంగా ఓ ప్రకటన విడుదల చేసింది. గుట్కాలు, పాన్ మసాలాలను స్టేడియంలోనికి తీసుకుని రావొద్దని కోరింది. గుట్కా తిని ఎక్కడంటే అక్కడ ఉమ్మి వేయడం వల్ల స్టేడియం తన అందాన్ని కోల్పోతుందని, శుభ్రపర్చడానికి ఇబ్బందులు పడాల్సి వస్తుందని పేర్కొంది.
ఇదివరకు గుట్కా, పాన్ మసాలా పాకెట్లను చించి పడేయడం వల్ల బాత్రూమ్ పైపులు మూసుకుపోయాయని, వాటిని తొలగించడంలో సిబ్బంది తల ప్రాణం తోకలోకొచ్చిందని వివరించింది క్రికెట్ అసోసియేషన్. గుట్కా మరకలను తొలగించడానికి ప్రత్యేకంగా డబ్బులను చెల్లించాల్సి వచ్చిందని వివరించింది.