అహ్మదాబాద్: ఇంకొన్ని గంటలు. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కళ్ల ముందు ప్రత్యక్షం కాబోతోంది. ఐసీసీ వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఈ మధ్యాహ్నం గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మధ్యాహ్నం 2 గంటలకు మొదలవుతుంది.
వరల్డ్ కప్ టోర్నమెంట్లో పాకిస్తాన్పై భారత్కు ఓ అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటివరకు వరల్డ్ కప్ టోర్నమెంట్లో ఒక్కసారి కూడా పాకిస్తాన్ చేతిలో టీమిండియా ఓడిపోలేదు. అన్ని మ్యాచ్లల్లోనూ విజయఢంకా మోగించింది. వరల్డ్ కప్లో ఇప్పటివరకు ఏడుసార్లు ఈ రెండు జట్లు తలపడగా.. అన్నిసార్లూ భారత్దే పైచేయి అయింది.

అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియం వద్ద అనూహ్య పరిస్థితులు నెలకొన్నాయి. ఈ మ్యాచ్కు కనివినీ ఎరుగని విధంగా భారీ భద్రతను కల్పించింది గుజరాత్ ప్రభుత్వం. భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది. 6,000 మంది పోలీసులను మోహరింపజేసింది. నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్.. బలగాలతో భద్రత కల్పించింది.
ఈ మ్యాచ్ను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. శనివారం మ్యాచ్ ఆరంభానికి ముందు జరిగే వేడుకలకూ ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కానున్నారు. అమిత్ షా కొడుకు జై షా.. బీసీసీఐ కార్యదర్శి హోదాలో ఇందులో పాల్గొంటారు.
ఈ హైఓల్టేజ్ మ్యాచ్ను తిలకించడానికి అభిమానులు పోటెత్తారు. లక్షా 30 మంది అభిమానులు ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించనున్నారు. ఈ ఉదయం నుంచే నరేంద్ర మోదీ స్టేడియానికి పోటెత్తారు ఫ్యాన్స్. గుంపులు గుంపులుగా చేరుకున్నారు. స్టేడియానికి దారి తీసే మార్గాలన్నీ రద్దీతో నిండిపోయాయి. ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఒక్కో ప్లేయర్ అభిమాని.. ఒక్కో రకంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, లోకల్ బాయ్ హార్దిక్ పాండ్యా.. ఫ్యాన్స్ ప్లకార్డులు, ఫొటోలు స్టేడియం వద్ద భారీ సంఖ్యలో కనిపించాయి. స్టేడియం పరిసరాల్లో వారి కటౌట్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను సైతం కట్టారు అభిమానులు.