వరల్డ్ కప్లో మంచి జోరుమీదున్న టీమిండియాకు గట్టి షాక్ తగిలింది. బంగ్లాదేశ్తో మ్యాచులో బౌలింగ్ చేస్తూ గాయపడిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా.. జట్టుకు దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. బంగ్లా మ్యాచ్లో తను వేసిన తొలి ఓవర్లోనే పాండ్యాకు గాయమైంది. బ్యాటర్ కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ను కాలితో అడ్డుకునేందుకు అతను ప్రయత్నించాడు.
ఈ క్రమంలో బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయాడు. ఈ సమయంలో అతని మడమ బెణికింది. దీంతో అతన్ని వెంటనే స్కానింగ్కు తీసుకెళ్లారు. ఆ మ్యాచులో కేవలం మూడు బంతులే వేసిన పాండ్యా మళ్లీ బౌలింగ్కు రాలేదు. బ్యాటింగ్ కూడా చేయలేదు. అతని గాయం పెద్దది కాదని, కానీ ముందు జాగ్రత్తగా న్యూజిల్యాండ్తో మ్యాచులో కూడా పాండ్యా ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది.

ఇంగ్లండ్తో లక్నో వేదికగా జరిగే మ్యాచులో పాండ్యా ఆడతాడని టీం మేనేజ్మెంట్ తెలిపింది. అయితే ఇప్పుడు అది కూడా జరిగేలా లేదు. పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో భారత్ ఆడే తర్వాతి మూడు మ్యాచులకు పాండ్యా దూరం అవుతాడని తెలుస్తోంది. కివీస్తో మ్యాచులోనే పాండ్యా లేని లోటు చాలా స్పష్టంగా కనిపించింది.
మూడో పేసర్ లేకపోవడంతో శార్దూల్ను పక్కన పెట్టి షమీని తీసుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో బ్యాటింగ్లో కూడా సూర్య పెద్దగా రాణించలేదు. దీంతో బ్యాటింగ్ కూడా కొంత బలహీనంగా కనిపించింది. జట్టును బ్యాలెన్స్ చేసే ప్లేయర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. అలాంటిది ఇప్పుడు అతను ఇంగ్లండ్, శ్రీలంక, సౌతాఫ్రికాతో జరిగే మ్యాచులకు దూరం అయినట్లు తెలిసి ఫ్యాన్స్ షాకవుతున్నారు.
ప్రస్తుతం ఇంగ్లండ్ తను ఆడే మ్యాచులన్నీ గెలవాల్సిన పరిస్థితిలో ఉంది. కాబట్టి భారత్పై కూడా పట్టుదలగా ఆడే అవకాశం ఉంది. ఇలాంటి మ్యాచులో పాండ్యా లేకపోతే కష్టమని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక అద్భుతమైన ఫామ్లో ఉన్న సౌతాఫ్రికా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ మూడు మ్యాచుల్లో పాండ్యా లేకపోవడం కచ్చితంగా టీమిండియాకు సమస్యగా మారుతుందని నిపుణులు అంటున్నారు.
ఇక లీగ్ దశలో భారత్ ఆడే చివరి మ్యాచ్ నెదర్లాండ్స్తో. మళ్లీ ఆ మ్యాచులోనే పాండ్యా రీఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది. అయితే ఇప్పటికే వరుసగా ఐదు మ్యాచులు గెలిచిన భారత్.. మరొక్క మ్యాచ్ గెలిస్తే సెమీస్ బెర్తు ఖాయం చేసుకుంటుంది. కాబట్టి పాండ్యాను సెమీఫైనల్, ఫైనల్ మ్యాచుల కోసం జాగ్రత్తగా వాడుకుంటేనే మంచిదని మరికొంతమంది ఫ్యాన్స్ అభిప్రాయం.