వరల్డ్ కప్లో తమకు ఎదురు లేదని భారత జట్టు మరోసారి నిరూపించింది. బ్యాటింగ్ కష్టంగా ఉన్న పిచ్పై 229 పరుగులను కాపాడుకొని ఇంగ్లండ్కు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఏకంగా 100 పరుగుల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించింది. ఈ క్రమంలో టీమిండియా వెటరన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పలు సందర్భాల్లో తమ సంతోషాన్ని పంచుకుంటూ కనిపించారు.
ఈ టోర్నీలో అద్భుతమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచులో మాత్రం విఫలమయ్యాడు. మొత్తం 9 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో తను బాధ్యత తీసుకున్న రోహిత్ శర్మ (87) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బ్యాటింగ్ కష్టంగా ఉన్నా కూడా తనదైన స్టైల్లో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.

ఈ పిచ్పై 230 పరుగుల టార్గెట్ను టీమిండియా కాపాడుకుంటుందా? అని అంతా అనుకున్నారు. అయితే రోహిత్ తన బౌలర్లను చాలా తెలివిగా వాడుకున్నాడు. ఈ క్రమంలోనే మహమ్మద్ షమీ నాలుగు వికెట్లతో చెలరేగాడు. బుమ్రా మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ రెండు వికెట్లతో రాణించాడు. దీంతో భారత్ ఏకంగా 100 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ క్రమంలో వికెట్లు పడిన పలు సందర్భాల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి సంబరాలు చేసుకున్నారు. ఒకసారైతే సంతోషంతో ఊగిపోయిన కోహ్లీ.. రోహిత్ శర్మను గాల్లోకి ఎత్తేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. వీళ్లిద్దర్నీ ఇంత సంతోషంలో చూస్తుంటే మ్యాచ్ గెలిచినంత తృప్తిగా ఉందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా రోహిత్, కోహ్లీ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. వాళ్లిద్దరూ అలా సంతోషంగా ఉంటే తమకు ఇంకేం అక్కర్లేదని కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వాళ్లను ఇలా చూస్తుంటే చాలా సమస్యలు తీరిపోతాయని, మ్యాచులో హైలైట్ సీన్స్లో రోహిత్-విరాట్ హగ్ టాప్లో ఉంటుందని మరికొందరు అంటున్నారు.