అహ్మదాబాద్: ఇంకొక్కరోజు మత్రమే మిగిలివుంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది.
కోల్కత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్లో చెమటోడ్చుతుంది.
డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లాంబుషెన్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్.. ఇలా జట్టు మొత్తం ప్రాక్టీస్ సెషన్లో తలమునకలైంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్.. దూకుడుగా షాట్లు ఆడటం కనిపించింది. కొన్ని స్విచ్ షాట్లు, రివర్స్ స్వీప్ షాట్లను ప్రాక్టీస్ చేశారు.
ఈ వరల్డ్ కప్ ఫైనల్స్పై ఎవరి అంచనాలు వారు వ్యక్తం చేస్తోన్నారు. గెలుపోటములపై జోస్యం చెబుతున్నారు. ఇప్పటికే పలువురు మాజీలు, లెజెండరీ ప్లేయర్లు తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఫైనల్స్లో ఏ జట్టు గెలుస్తుందనే విషయంపై విశ్లేషణలను అందించారు. దానికి గల కారణాలనూ వివరించారు.
ప్రముఖ జ్యోతిష్కుడు సుమిత్ బజాజ్ (Astrologer Sumit Bajaj) తన అంచనాలు వెల్లడించాడు. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో ఆదివారం జరిగే ఫైనల్స్లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు గెలుస్తుందని, ఈ వరల్డ్ కప్ 2023 ఛాంపియన్గా నిలుస్తుందని జోస్యం చెప్పారు.

ఈ గేమ్- టీమిండియాకు అత్యంత కఠినమైన మ్యాచ్గా మారుతుందని సుమిత్ బజాజ్ చెప్పారు. ఈ వరల్డ్ కప్లో ఇప్పటివరకు భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల కంటే ఇదే క్లిష్టమైనదని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ- గెలుపు ఖాయమని అన్నారు. ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్ తీసుకున్న నిర్ణయమే ఆ జట్టు ఓటమికి దారి తీస్తుందని అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కమ్మిన్స్ చింతిస్తాడని తేల్చి చెప్పారు.