న్యూఢిల్లీ: ప్రపంచ కప్ 2023లో టీమిండియా హవా కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్లో నెగ్గి కాకమీదుంది టీమ్. ఇదే ఊపుతో ఇక పాకిస్తాన్పై జెండా ఎగరేయడానికి రెడీ అవుతోంది. ఎల్లుండే ఈ హైఓల్టేజ్ మ్యాచ్ షెడ్యూల్ అయింది. అటు పాకిస్తాన్ కూడా వరుస విజయాలతో దూకుడు కొనసాగిస్తోంది.
తొలి మ్యాచ్లో ఆస్ట్రేలియా, మలి మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ను మట్టికరిపించింది భారత్. బుధవారం రాత్రి ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆఫ్ఘన్ను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 272 పరుగులు చేయగా.. 35 ఓవర్లల్లో కొట్టిపడేసింది టీమిండియా.

కేప్టెన్ రోహిత్ శర్మ సెంచరీతో అదరగొట్టాడు. 84 బంతుల్లోనే 131 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్లో 16 బౌండరీలు, అయిదు భారీ సిక్సర్లు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ- 55 (నాటౌట్), ఇషాన్ కిషన్- 47 పరుగులు చేశారు. శ్రేయాస్ అయ్యర్- 25 పరుగులతో చివరి వరకూ క్రీజ్లో నిలిచాడు.
ఈ సెంచరీతో ఎన్నో రికార్డులను తిరగరాశాడు రోహిత్ శర్మ. ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్గా ఆవిర్భవించాడు. ఇప్పటివరకు 556 సిక్సర్లు కొట్టాడీ హిట్మ్యాన్. ఇదివరకు ఈ రికార్డు వెస్టిండీస్ బ్యాటింగ్ లెజెండ్ క్రిస్ గేల్ మీద ఉండేది. దాన్ని తుడిచి పెట్టాడు. రోహిత్ శర్మ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు.
సిక్సర్లు కొట్టడంలో సరికొత్త రికార్డ్ సృష్టించడంపై స్పందించాడు రోహిత్. అసలు సిక్సర్లు కొట్టలేనని కేరీర్ ఆరంభంలో భావించానని చెప్పాడు. బంతిని ఫెన్సింగ్ దాటించడం చేతకాదని అనుకున్నానని పేర్కొన్నాడు. ఇలాంటి రికార్డ్ ఒకటి తన పేరు నమోదవుతుందని మొదట్లో అంచనా వేయలేదని వ్యాఖ్యానించాడు.
క్రికెట్లో ఇంకా చాలా దూరం వెళ్లాల్సి ఉందని, తన ప్రయాణం ఇక్కడితో ఆగదనీ చెప్పాడు. ఈ రికార్డుతో తాను సంతృప్తి చెందట్లేదని తేల్చి చెప్పాడు. జట్టును అత్యున్నత స్థాయికి తీర్చే క్రమంలో ఇలాంటి రికార్డులు నమోదవుతుంటాయని, వాటి వల్ల సంతోషపడతానే తప్ప సంతప్తి చెందబోనని పేర్కొన్నాడు.