వరల్డ్ కప్లో తమ జర్నీని మొదలు పెట్టేందుకు టీమిండియా రెడీ అవుతోంది. ఈ ఏడాది భారత్ కనుక ట్రోఫీ ముద్దాడాలి అంటే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఈ టీంకు చాలా ముఖ్యం. ఈ క్రమంలోనే శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్.. కోహ్లీకి కీలక సలహా ఇచ్చాడు. కోహ్లీ కనుక తన ఎగ్రెషన్ తగ్గించుకుంటే ఇక తన పని అయిపోయినట్లే అంటూ షాకింగ్ కామెంట్స్ కూడా చేశాడు.
కొంత కాలం క్రితం వరకు విరాట్ కోహ్లీ.. మైదానంలో చాలా దూకుడుగా కనిపించే వాడు. అది చూసిన చాలా మంది.. కోహ్లీ మరీ ఎగ్రెసివ్గా ఉంటున్నాడని విమర్శించే వాళ్లు. ఇటీవలి కాలంలో కోహ్లీ కూడా తన దూకుడు కొంత తగ్గించుకున్నాడు. కొన్ని రోజుల క్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మరీ అంత ఎగ్రెసివ్గా తనను మళ్లీ చూడటం జరగదని చెప్పేశాడు. ఈ మాటలు మురళీ ధరన్కు పెద్దగా నచ్చలేదు.

కోహ్లీలో దూకుడు తగ్గడం అంత మంచిది కాదని మురళీధరన్ అభిప్రాయం. ఎందుకంటే ఆ దూకుడే కోహ్లీలో బెస్ట్ ఆటగాడిని బయటకు తీస్తుందని ఈ లెజెండరీ స్పిన్నర్ చెప్తున్నాడు. 'కోహ్లీ కెప్టెన్ కాకపోయినా సరే.. వికెట్ తీసిన బౌలర్ కన్నా కోహ్లీనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటాడు. అది క్రికెట్ మీద కోహ్లీకి ఉన్న ప్యాషన్. అది కనుక పోతే ఇక కోహ్లీ దేనికీ పనికిరాడు. అతని ఖేల్ ఖతం అయిపోయినట్లే' అని ఘాటుగా మాట్లాడాడు మురళీధరన్.
'అప్పటి వరకు మాత్రం చాలా మంది కోహ్లీ మరీ ఎగ్రెసివ్గా ఉన్నాడని అంటూనే ఉంటారు. కానీ నువ్వు మాత్రం నీలాగే ఉండు. మైదానం బయట కోహ్లీ చాలా మంచి జెంటిల్మెన్. చాలా ప్రశాంతంగా, సైలెంట్గా ఉంటాడు. కానీ మైదానంలో వేరేగా ఉంటాడు. అది తన ప్యాషన్. దాని కారణంగానే కోహ్లీ ఈ స్థాయికి వచ్చాడు. అందుకే ఈ యాటిట్యూడ్ మార్చుకోవద్దనే నేను ఎప్పుడూ చెప్తా. తను మైదానంలో ఎలా ఉంటాడో అలాగే ఉండాలి. లేదంటే తన పెర్ఫామెన్స్ దెబ్బతింటుంది' అని మురళీధరన్ వివరించాడు.