భారత్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో తాము ఆడేదీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని, ప్రభుత్వంతో దీని గురించి చర్చిస్తున్నామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెప్పిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో పాక్ ఈ వ్యాఖ్యలు చేసింది. దీంతో ఈ వరల్డ్ కప్లో పాకిస్తాన్ ఆడదేమో? అని కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆసియా కప్ కోసం భారత జట్టును పాక్కు పంపడం కుదరదని బీసీసీఐ చెప్పినప్పటి నుంచి పాకిస్తాన్ కోపంగానే ఉంది. తాము కూడా వరల్డ్ కప్ కోసం భారత్కు రాబోమని హెచ్చరికలు చేసింది. ఇప్పుడు మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ పగ తీర్చుకుంటోందని చాలా మంది అనుకున్నారు. అయితే ఇలాంటి పిచ్చి చేష్టలు పనికిరావనేలా పీసీబీకి ఐసీసీ చిన్నగా చురకలేసింది.

వరల్డ్ కప్ పార్టిసిపేషన్ అగ్రిమెంట్పై పాకిస్తాన్ సంతకం చేసిందని ఐసీసీ గుర్తుచేసింది. 'పార్టిసిపేషన్ అగ్రిమెంట్పై పాకిస్తాన్ సంతకం చేసింది. ఆ టీం టోర్నీలో పాల్గొంటుందనే ఆశిస్తున్నాం. మరో విధమైన ఆలోచనలేవీ మాకు లేవు' అని తేల్చిచెప్పేసింది. ఈ మేరకు ఐసీసీ ఒక ప్రకటన విడుదల చేసింది. అన్ని సభ్య దేశాలు కూడా తమ తమ దేశాల చట్టాలకు కట్టుబడి ఉండాలనే విషయం తమకు తెలుసని తెలిపింది.

ఆయా ప్రభుత్వాల నిర్ణయాలను తాము గౌరవిస్తామని, కానీ వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు భారత్కు వస్తుందనే నమ్మకం తమకుందని స్పష్టం చేసింది. వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదలవగానే పీసీబీ ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. 'భారత్లో ఎలాంటి పర్యటనకు వెళ్లాలన్నా పీసీబీకి పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రావాలి. మాకు అది రాగానే ఐసీసీకి అప్డేట్ ఇస్తాం' అని పీసీబీ తెలిపింది. ఈ విషయం ఇప్పటికే ఐసీసీకి కూడా చెప్పామని పేర్కొంది.