World Cup 2023: సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచులో టీమిండియా ఘనవిజయం సాధించింది. పాయింట్ల పట్టికలో టాప్ -2లో ఉన్న జట్ల మద్య మ్యాచులా కాకుండా.. ఏదో పసికూనను ఆడుకున్నట్లు సఫారీలను టీమిండియా ఒక ఆట ఆడుకుంది. ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు రోహిత్ శర్మ (40), శుభ్మన్ గిల్ (23) ధనాధన్ ఆరంభం అందించారు. వాళ్ల ఆట చూసిన వాళ్లంతా ఈ పిచ్పై ఈజీగా 350 స్కోరు చేయొచ్చని అనుకున్నారు.
కానీ తొలి పవర్ ప్లే ముగిసిన తర్వాతి నుంచి బంతి ఫుల్గా టర్స్ అవడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలో మరో వికెట్ పడకుండా విరాట్ కోహ్లీ (101 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (77) ఆదుకున్నారు. అయితే చాలా మంది ఫ్యాన్స్.. రోహిత్, గిల్ అద్భుతంగా ఆడారని, కోహ్లీ స్వార్థంతో ఆడాడని అన్నారు. ఇవన్నీ తప్పుడు మాటలని మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ చెప్పాడు.

'యాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ వేరే ప్లానెట్పై ఆడారు. ఇదేం వాంఖడే, ఢిల్లీ వంటి పిచ్ కాదు. ఆ రెండు స్టేడియాల్లో మ్యాచ్ ఆసాంతం పరుగులు చేయడం ఈజీగా ఉంటుంది. ఇక్కడ మాత్రం ఆరంభంలో పరుగులు చేయడం ఈజీగా అనిపించింది. కానీ మ్యాచ్ సాగేకొద్దీ పరుగులు రావడం కష్టమైంది. కాబట్టి నన్నడిగితే రోహిత్, గిల్ కన్నా కూడా కోహ్లీ, అయ్యర్ను ఎక్కువ మెచ్చుకోవాలి' అని గంభీర్ అన్నాడు.
'ఇక్కడ స్పిన్ చాలా పెద్ద సవాల్. వాళ్లిద్దరూ కేశవ్ మహరాజ్ను ఎదుర్కొన్న తీరు అద్భుతం. మహరాజ్ వేసిన పది ఓవర్లలో వచ్చింది 30 పరుగులే అయినా.. అతను కేవలం ఒక్క వికెట్ మాత్రమే లభించింది. మహరాజ్కు మరో వికెట్ దక్కకుండా కోహ్లీ, అయ్యర్ అడ్డుకున్న తీరు అద్భుతం. దీని వల్లనే చివర్లో సౌతాఫ్రికా టీం మళ్లీ తమ పేసర్లను రంగంలోకి దించాల్సి వచ్చింది' అని వివరించాడు.
'అలాగే అయ్యర్ను కచ్చితంగా మెచ్చుకోవాలి. ఎందుకంటే అతనే కోహ్లీపై మరీ ఎక్కువ ఒత్తిడి పడకుండా చూసుకున్నాడు. అందుకే కోహ్లీ చివరి వరకు క్రీజులో నిలబడగలిగాడు. అయ్యర్ కనుక మరీ ఎక్కువ డాట్ బాల్స్ ఆడి ఉంటే.. ఆ స్టేజ్లో భారీ షాట్లు ఆడకపోయి ఉంటే.. కోహ్లీపై చాలా ప్రెషర్ పెరిగిపోయేది' అని చెప్పుకొచ్చాడు.
'షంసీ బౌలింగ్లో రెండు సిక్సర్లు, యాన్సెన్ బౌలింగ్లో మూడు బౌండరీలు బాదిన అయ్యర్.. కోహ్లీపై ఆ ఒత్తిడి పడనివ్వలేదు. కోహ్లీపై కనుక ప్రెషర్ పెరిగి ఉంటే, అతను భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాల్సి వచ్చేది. ఆ తొందరపాటులో పొరపాట్లు జరగడం సహజం. కాబట్టి అయ్యర్ను కూడా మెచ్చుకొని తీరాలి' అని గంభీర్ పేర్కొన్నాడు.