వరల్డ్ కప్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. జట్టుకు ప్రతి మ్యాచులోనూ విధ్వంసకర ఆరంభాలు అందించాడు. ఎలాంటి బౌలింగ్ ఎటాక్ అయినా సరే.. తను మాత్రం ఎదురు దాడికి దిగాడు. అయితే ఎడాపెడా బౌండరీలు బాదే ప్రయత్నంలో పలుమార్లు మంచి ఆరంభాలను వృధా చేసుకున్నాడు. దీనిపై పలువురు రోహిత్ను తప్పుబట్టారు.
ఈ క్రమంలో టీమిండియా మాజీ లెజెండ్ గౌతం గంభీర్ మాత్రం రోహిత్కు మద్దతుగా నిలిచాడు. ఇలా కేవలం భారత్ మాత్రమే కాదని, ఉపఖండంలోని టీమ్స్ అన్నిటికీ కూడా ఈ గణాంకాల పిచ్చి వల్ల నష్టం జరుగుతోందని అన్నాడు. రోహిత్ కనుక నిదానంగా ఆడి ఉంటే.. కనీసం మూడు, నాలుగు సెంచరీలు బాదేవాడని, కానీ జట్టు కోసం భారీ షాట్లు ఆడాడని చెప్పాడు.

ఇలాంటి హై రిస్క్ ఆటతీరుతో కూడా టోర్నీలో రెండో టాప్ స్కోరర్గా రోహిత్ నిలిచాడు. అతను 11 మ్యాచుల్లో 597 పరుగులు సాధించాడు. వీటిలో కేవలం ఒక్క సెంచరీ మాత్రమే ఉంది. మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డీ కాక్ నాలుగు సెంచరీలుబ బాదాడు. కోహ్లీ, కివీస్ బ్యాటర్ రచిన్ రవీంద్ర చెరో మూడు శతకాలు సాధించారు.
'సెంచరీలకు అర్థం లేదు. రోహిత్ ఆడిన విధానం ముఖ్యం. రోహిత్ కూడా ఈ వరల్డ్ కప్లో నాలుగు సెంచరీలు చేయొచ్చు. వన్డేల్లో సెంచరీలు చేయడం అంత కష్టమేమీ కాదు. డీకాక్ నాలుగు సెంచరీలు చేశాడు కదా. ఈ గణాంకాల పిచ్చి నుంచి ఉపఖండపు జట్లు బయటకు రాకపోతే.. అవి ఎప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేవు' అని గంభీర్ తేల్చిచెప్పాడు.
'గట్టిగా మాట్లాడితే మనం ఈ దేశాన్ని మార్చాలి. జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు తీసుకున్నాడనుకో.. అతను చాలా గొప్ప బౌలర్ అయిపోతాడు. అదే వేరే బౌలర్ రెండు వికెట్లే తీసుకుంటే అతను పెద్ద బౌలర్ కాదంటారు. కానీ మంచి బౌలర్ అవ్వడమే ముఖ్యం. ఆ రెండు వికెట్లే చాలా కీలకం కావొచ్చు కదా' అని చెప్పుకొచ్చాడు.