నెలరోజులకు పైగా సాగిన వన్డే వరల్డ్ కప్ ముగిసింది. టోర్నీ ఆసాంతం అద్భుతంగా ఆడిన టీమిండియా.. ఫైనల్లో తడపడి ట్రోఫీ చేజార్చుకుంది. ఈ మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టుకు సరైన ఆరంభం దక్కలేదు. రోహిత్ శర్మ రాణించినా కూడా.. యువ ఓపెనర్ శుభ్మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ విఫలమయ్యారు.
హాఫ్ సెంచరీ బాదిన తర్వాత అనుకోని విధంగా కోహ్లీ అవుటవగా.. విపరీతమైన ఒత్తిడికి గురైన రాహుల్ ఇన్నింగ్స్ చక్కదిద్దలేకపోయాడు. ఈ క్రమంలో చివర్లో బ్యాటింగ్కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ మరీ పేలవంగా ఆడాడు. కనీసం బంతిని ఫేస్ చేయడానికి ఆలోచించిన అతను.. టెయిలెండర్లను ఎక్కువగా స్ట్రైకింగ్కు పంపడం ఫ్యాన్స్కు చికాకు తెప్పించింది.

ఈ క్రమంలో అసలు అతన్ని జడేజా తర్వాత ఎందుకు దింపారో ఫ్యాన్స్కు అర్థం కాలేదు. టీమిండియా మాజీ లెజెండ్ గౌతమ్ గంభీర్ కూడా ఈ నిర్ణయం వెనుక లాజిక్ ఏంటో తనకు తెలియలేదన్నాడు. పోనీ సూర్య కన్నా ముందు వచ్చిన జడేజా ఏమైనా రాణించాడా. అంటే అది కూడా లేదు. జడ్డూ ఈ మ్యాచులో 22 బంతుల్లో 9 పరుగులు చేసి అవుటయ్యాడు.
సూర్య 28 బంతులు ఎదుర్కొని 18 పరుగులు చేశాడు. 'నేను సూర్య బ్యాటింగ్ చూడలేదు. కానీ అతన్ని ఏడో స్థానంలో పంపడం సరైన నిర్ణయం కాదు. అసలు అలా ఎందుకు చేశారో నాకు అర్థం కాలేదు' అని గంభీర్ చెప్పాడు. అలాగే విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడని గంభీర్ గుర్తుచేశాడు. ఇలాంటి సమయంలో సూర్యను దింపాల్సిందని చెప్పాడు.
'విరాట్ అవుటైన తర్వాత కేఎల్ రాహుల్ ఒక టెంపోలో బ్యాటింగ్ చేశాడు. ఆ టైంలో సూర్యను పంపి ఎగ్రెసివ్ ఆట ఆడాలని చెప్పి ఉంటే అర్థం ఉండేది. కావాలంటే నీ తర్వాత జడేజా ఉన్నాడని అతనికి ధైర్యం చెప్పాల్సింది' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.