World Cup 2023: వరల్డ్ కప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాపై నలువైపుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా న్యూజిల్యాండ్, ఇంగ్లండ్ రూపంలో రెండు బలమైన జట్లను ఎదుర్కొన్న భారత్ అద్భుతమైన విజయాలు నమోదు చేసింది. హార్దిక్ పాండ్యా వంటి కీలక ప్లేయర్ దూరమైనా కూడా భారత్ చెలరేగింది.
ఈ రెండు మ్యాచుల్లో కూడా భారత్కు కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఆరంభాలు అందించాడు. ముఖ్యంగా ఇంగ్లండ్పై అతను ఆడిన 87 పరుగుల ఇన్నింగ్స్.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిందనే చెప్పాలి. రోహిత్, కేఎల్ రాహుల్ మధ్య భాగస్వామ్యం ఈ మ్యాచులో భారత్ స్కోరు 229 పరుగులు చేరడంలో కీలక పాత్ర పోషించింది.

కేవలం ఈ మ్యాచుల్లోనే కాదు.. వరల్డ్ కప్ ఆరంభమైనప్పటి నుంచి ఒక్క ఆసీస్తో మ్యాచ్ మినహా మిగతా మ్యాచుల్లో రోహిత్ అదరగొట్టాడు. తొలి పవర్ప్లేలో భారత్కు అవసరమైన ధనాధన్ షాట్లు ఆడి, మంచి పాజిటివ్ ఓపెనింగ్స్ అందించాడు. దీంతో ఆ తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందనే చెప్పాలి. రోహిత్ ఇలా రాణించడం ఈ వరల్డ్ కప్లో భారత్కు చాలా ముఖ్యమని మాజీ పేసర్ శ్రీశాంత్ అన్నాడు.
ఇంగ్లండ్పై రోహిత్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన అతను.. 'ఇండియా చాలా చిన్న టోటల్ మాత్రమే చేయగలిగింది. కానీ దానిలో కూడా రోహిత్ చేసిన 87 పరుగులు చాలా చాలా ఇంపార్టెంట్. తను చాలా అద్భుతంగా ఆడాడు. రోహిత్ ఇదే తరహాలో మంచి ఇంటెంట్తో పరుగులు చేయడం భారత్కు చాలా అవసరం' అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

'మనం అద్భుతంగా ఆడి, జట్టు ఓడితే ప్రయోజనం ఉండదు. టీం గెలవడం ముఖ్యం. కొంత మంది ఇలా రికార్డుల కోసం పరిగెడుతూ ఉంటారు. కానీ చివరకు విజయమే ముఖ్యమని తెలుసుకోవాలి. మన టీంలో ఒక ప్లేయర్ మన కన్నా బాగా ఆడుతున్నాడంటే.. అది జట్టుకు మంచిదే కదా' అని పేర్కొన్నాడు.