బంగ్లాదేశ్పై టీమిండియా సునాయాసంగా గెలిచినా కూడా.. టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమవడం జట్టును బాగా దెబ్బతీసింది. అయితే అతను లేని లోటు తెలియకుండా రోహిత్ చాలా తెలివిగా బౌలింగ్ వనరులను ఉపయోగించుకున్నాడు. అదే సమయంలో స్పిన్నర్లు కూడా రాణించారు. దీంతో భారత జట్టు విజయం సాధించింది.
అయితే ఇప్పుడు బలమైన న్యూజిల్యాండ్ను ఎదుర్కొనే సమయంలో ఇలా బౌలింగ్ విభాగంలో లోటుతో బరిలో దిగడం టీమిండియాకు పెద్ద సమస్యే అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇషాన్ కిషన్ లేదా సూర్యకుమార్ యాదవ్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని చాలా మంది నిపుణులు అంటున్నారు. ఈ జాబితాలో తాజాగా ఆకాష్ చోప్రా కూడా చేరాడు.

పాండ్యా స్థానంలో సూర్యకుమార్ యాదవ్కు చోటివ్వాలని చోప్రా సూచించాడు. ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ను ఆడిస్తే బెటర్ అని చోప్రా అన్నాడు. అదే సమయంలో అలా వద్దనుకుంటే బౌలింగ్ కోసం మహమ్మద్ షమీని ఆడించాలని సలహా ఇచ్చాడు. ఈ వరల్డ్ కప్లో భారత్కు బ్యాటింగ్ విభాగంలో పాండ్యాపై ఆధారపడే అవసరం రాలేదు.
అయితే బౌలింగ్లో అతను చాలా కీలకంగా మారాడు. అందుకే పాండ్యా స్థానంలో షమీని తీసుకోవాలని చోప్రా అంటున్నాడు. పాండ్యా లేకపోవడం వల్ల జట్టు కాంబినేషన్ మారిపోయిందని, జట్టులో తను చాలా కీలకమైన ప్లేయర్ అని అభిప్రాయపడ్డాడు. కివీస్తో మ్యాచ్లో అలాంటి ఆటగాడు లేకపోవడం టీమిండియాపై చాలా ప్రభావం చూపుతుందన్నాడు.
'నేను చెప్పేది కొంత మందికి నచ్చకపోవచ్చు. కానీ కోహ్లీ, రోహిత్, కేఎల్ ఇలా ఏ బ్యాటర్ అయినా.. లేదంటే షమీ, సిరాజ్, బుమ్రా వంటి బౌలర్ అయినా ఏదో కారణంతో జట్టుకు దూరమైనా జట్టు కాంబినేషన్పై పెద్దగా ప్రభావం ఉండదు. కానీ ప్రస్తుతం టీంలో ఒక్క ప్లేయర్ ఉన్నాడు. అతను లేకపోతే జట్టు కాంబినేషన్ అంతా మారిపోతుంది. అతనే హార్దిక్ పాండ్యా' అని చోప్రా వివరించాడు.
'హార్దిక్ ఈ టీంలో టాప్-6లో బ్యాటింగ్ చేస్తాడు. జట్టులో చక్కగా బౌలింగ్ చేసే బ్యాటర్ అతనొక్కడే. అతనికి గాయమవడం భారత జట్టుకు చాలా సమస్యలు తీసుకొచ్చింది. సూర్యను ఆరో స్థానంలో ఆడించడం వారి వద్ద ఉన్న ఒక ఆప్షన్. అలాగే షమీని కూడా జట్టులోకి తీసుకొస్తారని నేను అనుకుంటున్నా. అంటే జట్టు బ్యాలెన్స్పై కచ్చితంగా ప్రభావం ఉంటుంది' అని పేర్కొన్నాడు.