భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్లో కూడా అంపైరింగ్ పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే అంపైర్లు ఇచ్చిన కొన్ని నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. భారత్, పాకిస్తాన్ వంటి మ్యాచుల్లో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు కూడా ఆటగాళ్లతోపాటు ప్రేక్షకులకు సైతం గట్టి షాకిచ్చాయి. సీనియర్ అంపైర్లు మరాస్ ఎరాస్మస్ వంటి వారు కూడా తప్పుడు నిర్ణయాలు ఇవ్వడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.
ఇలా అంపైర్లు తప్పుడు నిర్ణయాలు ఇవ్వడంపై పాక్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ మండిపడ్డాడు. వరల్డ్ కప్ వంటి మెగాటోర్నీలో ఇలాంటి చెత్త నిర్ణయాలు ఇవ్వడం సబబు కాదన్నాడు. దీని వల్ల టోర్నీ స్థాయి తగ్గుతుందని తెలిపాడు. 'ఈ వరల్డ్ కప్లో అంపైరింగ్ ఉండాల్సిన స్థాయిలో లేదు. పరమ చెత్త నిర్ణయాలు తీసుకున్నారు' అని ముక్కుసూటిగా విమర్శలు చేశాడు.

'డేవిడ్ వార్నర్, జానీ బెయిర్స్టో వంటి వారి విషయంలో కూడా పొరపాటు నిర్ణయాలు కనిపించాయి. ఇక భారత్, పాక్ మ్యాచులో మహమ్మద్ రిజ్వాన్ను కూడా అవుటిచ్చేశారు. అదృష్టం బాగుండి అతను రివ్యూ తీసుకున్నాడు. దాంతో అంపైర్ నిర్ణయం వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. అదే మ్యాచులో బాబర్ ఆజమ్ను కూడా అవుటిచ్చేవాళ్లు. కానీ బతికిపోయాడు' అని బట్ చెప్పుకొచ్చాడు.
ఈ టోర్నీలో అంపైరింగ్ అంతర్జాతీయ స్థాయిలో ఏమాత్రం కనిపించడం లేదని బట్ విమర్శించాడు. కాగా, శ్రీలంకతో మ్యాచులో వార్నర్ అవుటైనప్పుడు చాలా డిసప్పాయింట్ అయినట్లు కనిపించాడు. అతన్ని ఎల్బీడబ్ల్యూ అవుట్గా అంపైర్ ప్రకటించాడు. అయితే బంతి వికెట్లను మిస్ అవుతున్నట్లు కనిపించింది. కానీ రివ్యూలో చూస్తే అది అంపైర్ కాల్ అని చూపించింది. దీంతో వార్నర్ చాలా నిరాశగా మైదానం వీడాల్సి వచ్చింది.
ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా అంత సంతోషంగా లేరు. కేవలం భారత్ ఆడుతున్న మ్యాచ్ అనే కాదు, ఏ మ్యాచులో అయినా అంపైరింగ్ సరిగా లేకపోతే ప్రేక్షకులు మండిపడటం అందరికీ తెలిసిందే. ఇప్పుడు వరల్డ్ కప్లో అంపైర్లపై కూడా అభిమానులు ఇలాగే ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా అంపైర్లు కొంచెం జాగ్రత్తగా తమ పని చేస్తారేమో చూడాలి.