అహ్మదాబాద్: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్లో భారత్ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో భారత్తో తలపడుతుంది.
ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.

అటు ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ కోసం సమరోత్సాహంతో ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్లో చెమటోడ్చుతుంది.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియా కేప్టెన్ పాట్ కమ్మిన్స్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రీ- మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అతను మాట్లాడాడు. ఫైనల్స్లో భారత్కే అడ్వాంటేజ్ ఉందని వ్యాఖ్యానించాడు. సొంత గడ్డ, పిచ్, లక్షలాది మంది అభిమానుల మధ్య మ్యాచ్ ఆడబోతోండటం..ఇలా అన్ని రకాలుగా జట్టుకు కలిసొస్తుందని పేర్కొన్నాడు.
నరేంద్ర మోదీ స్టేడియంలో లక్షా 30 మంది అభిమానుల మధ్య ఫైనల్స్లో భారత జట్టును ఓడించడం అంత తేలికైన పనేమీ కాదని పేర్కొన్నాడు పాట్ కమ్మిన్స్. స్టేడియంలో అభిమానుల సందడి, కోలాహలం మధ్య ఆడటం తమకు కొత్తేమీ కాదని, ఇలాంటి వాతావరణం తమకు అలవాటేనని చెప్పాడు.
గతంలోనూ చాలాసార్లు భారత పర్యటనకు వచ్చినప్పుడు ఇలాంటి వాతావరణం మధ్య మ్యాచ్లు గెలిచిన సందర్భాలు ఉన్నాయని కమ్మిన్స్ గుర్తు చేశాడు. 2015 నాటి ఐసీసీ వరల్డ్ కప్లో ఆడిన అనుభవం ఉన్న ఏడెనిమిది మంది ప్లేయర్లు ప్రస్తుతం తమ జట్టులో ఉన్నారని గుర్తు చేశాడు. ఇలాంటి సందడి చూసినప్పుడు ఉత్సాహంతో డేవిడ్ వార్నర్ వంటి ప్లేయర్లు డాన్సులు చేస్తోంటారని వ్యాఖ్యానించాడు.