ముంబై: ఐసీసీ ప్రపంచ కప్ 2023 ఫైనల్స్లో భారత్ను ఢీ కొట్టే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఈ నెల 19వ తేదీన అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఫైనల్స్లో భారత్తో తలపడుతుంది.
ఇక ఫైనల్స్లో తలపడబోయే భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. లీగ్స్ దశ నుంచి సెమీ ఫైనల్స్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు టీమిండియా. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ దూకుడు మీద ఉన్నారు.

బౌలింగ్ డిపార్ట్మెంట్ సత్తా చాటుతోంది. ఒంటిచేత్తో మ్యాచ్లను గెలిపించింది. బ్యాటర్లు భారీగా పరుగులు చేస్తోండగా.. బౌలర్లు ప్రత్యర్థులను ఎక్కడికక్కడ కట్టడి చేస్తోన్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.. బ్యాటర్లను భయపెడుతున్నారు. లైన్ అండ్ లెంగ్త్తో బంతులను సంధిస్తూ నిప్పులు చెరుగుతున్నారు.
ఫైనల్స్లో ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకోవడానికి జట్టు సన్నద్ధమౌతోంది. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోంది. కేప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాతో పాటు గాయపడ్డ హార్దిక్ పాండ్యా స్థానంలో జట్టులో చోటు దక్కించుకున్న బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్నారు.
వరల్డ్ కప్ సన్నాహాలు చురుగ్గా సాగుతున్న వేళ.. అహ్మదాబాద్ స్టేడియం పిచ్ క్యురేటర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దాని గుట్టు విప్పారు. ఏ జట్టయినా సరే.. ఫైనల్స్ గెలవాలంటే తొలుత బ్యాటింగ్ ఎంచుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఈ పిచ్పై 315 పరుగులు చేస్తే సరిపోతుందని, విజయం సాధించడానికి ఆ పరుగులు సరిపోతాయని చెప్పారు.
సెకెండ్ ఇన్నింగ్ ఆడే జట్టుకు మాత్రం ఇబ్బందులు తప్పవని క్యురేటర్ అభిప్రాయపడ్డారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ- పిచ్ మందకొడిగా మారే అవకాశం ఉందని, అది బౌలర్లకు లబ్ది కలిగిస్తుందని చెప్పారు. ఇద్దరు క్యురేటర్లు, బీసీసీఐ జనరల్ మేనేజర్ పర్యవేక్షణలో ఉందీ పిచ్. ఐసీసీ పిచ్ కన్సల్టెంట్ ఆండీ అట్కిన్సన్కు వాళ్లు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.