అహ్మదాబాద్: ఇంకొక్కరోజు మత్రమే మిగిలివుంది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో తుది పోరుకు సర్వం సిద్ధమైంది. గుజరాత్లోని ప్రతిష్ఠాత్మక నరేంద్రమోదీ స్టేడియం వేదికగా భారత్ను ఢీకొట్టబోతోంది ఆస్ట్రేలియా. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ మ్యాచ్ మొదలుకానుంది.
కోల్కత ఈడెన్ గార్డెన్స్లో జరిగిన రెండో సెమీ ఫైనల్స్లో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది ఆస్ట్రేలియా. ఫైనల్స్లో అడుగుపెట్టింది. అమీతుమీ తేల్చుకోవడానికి రెండు జట్లు సన్నద్ధమౌతున్నాయి. నెట్స్లో కఠోరంగా శ్రమిస్తోన్నాయి. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తోన్నారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ సారథ్యంలో ప్రాక్టీస్ సెషన్ కంటిన్యూ అవుతోంది.

ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా సమరోత్సాహంతో సన్నద్ధమౌతోంది. ఉంది. బలమైన దక్షిణాఫ్రికాను సెమీ ఫైనల్స్లో మట్టికరిపించిన దూకుడు మీద కనిపిస్తోందా జట్టు. సొంత గడ్డపై చెలరేగుతున్న భారత్ను కట్టడి చేయడానికి సర్వశక్తులనూ ఒడ్డుతోంది. ఇందులో భాగంగా నెట్స్లో చెమటోడ్చుతుంది.
డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, లాంబుషెన్, జోస్ ఇంగ్లిస్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్.. ఇలా జట్టు మొత్తం ప్రాక్టీస్ సెషన్లో తలమునకలైంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్వెల్.. దూకుడుగా షాట్లు ఆడటం కనిపించింది. కొన్ని స్విచ్ షాట్లు, రివర్స్ స్వీప్ షాట్లను ప్రాక్టీస్ చేశారు.
ఈ పరిణామాల మధ్య భారత్, ఆస్ట్రేలియా కేప్టెన్లు రోహిత్ శర్మ, పాట్ కమ్మిన్స్.. ఫొటో షూట్లో పాల్గొన్నారు. అదలాజ్ దిగుడు బావి (Adalaj Stepwell)లో ఈ ఉదయం వారిద్దరిపై ఫోటో షూట్ చేశారు. ఐసీసీ- బీసీసీఐ సంయుక్తంగా నిర్వహించిన ఫొటో సెషన్ ఇది. దీని కోసం ఈ చారిత్రాత్మకమైన అదలాజ్ మెట్ల బావిని ఎంచుకుంది.
అహ్మదాబాద్- గాంధీనగర్ మధ్య గల శాంతిగ్రామ్ సమీపంలో ఉంటుంది ఈ దిగుడుబావి. 16వ శతాబ్దానికి చెందిన కట్టడం. 1499లో దీని నిర్మాణం మొదలుకాగా.. 1601లో పూర్తయింది. గుజరాత్లో ఇలాంటి మెట్ల బావులు చాలా ఉన్నాయి. చారిత్రక వారసత్వ సంపదగా వస్తోన్నాయి అవి.