ఆస్ట్రేలియాతో జరిగిన తమ తొలి వరల్డ్ కప్ మ్యాచులో భారత జట్టుకు దారుణమైన ఆరంభం లభించింది. 200 పరుగుల లక్ష్య ఛేదనలో కేవలం రెండు పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా.. కచ్చితంగా ఓడిపోతుందని అంతా అనుకున్నారు. అయితే అద్భుతమైన పట్టుదల కనబరిచిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ ఈ జట్టును ఆదుకున్నారు.
ఇది చూసిన ఫ్యాన్స్కు 2019 వరల్డ్ కప్లో న్యూజిల్యాండ్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ గుర్తొచ్చింది. ఆ మ్యాచులో కేవలం 5 పరుగులే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. చివరకు ఆ మ్యాచ్ ఓడిపోయి, వరల్డ్ కప్ నుంచి తప్పుకుందీ టీం. ఆసీస్తో మ్యాచ్ చూసిన వాళ్లందరికీ ఆ కివీస్ మ్యాచ్ గుర్తొచ్చింది. ఈ స్కోరు బోర్డు క్రికెట్ మ్యాచ్లా లేదని, ఏదో ఫుట్బాల్ మ్యాచ్ స్కోర్ కార్డులా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్లో కూడా భారత ఓపెనర్లు తేలిపోయారు. పాకిస్తాన్ పేసర్ షహీన్ అఫ్రిదీ ధాటికి సింగిల్ డిజిట్ స్కోర్లకే అవుటయ్యారు. ఆ మ్యాచులో కూడా కోహ్లీనే భారత జట్టు పరువు నిలిపాడు. ఫామ్లో లేకపోయినా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఇలా ప్రతిసారీ టీమిండియా టాపార్డర్ ఇలా సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటవడం చూసిన ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
అదే సమయంలో కివీస్ చేతిలో ఓటమి గుర్తొచ్చి ఎమోషనల్ అయిపోతున్నారు. అసలు ఈ ఫుట్బాల్ స్కోరు కార్డును టీమిండియా వదిలి పెట్టదా? అని నిలదీస్తున్నారు. అలాగే ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, శ్రేయాస్ అయ్యర్ అవుటైన విధానాన్ని కూడా తిట్టిపోస్తున్నారు. రోహిత్ ఏమాత్రం ఫుట్ వర్క్ చూపించకుండా ఎల్బీడబ్ల్యూ అవుటయ్యాడు.
ఇక గిల్ లేకపోవడంతో అవకాశం దక్కిన ఇషాన్ కిషన్ పరమ చెత్త షాట్ ఆడాడు. ఆఫ్ స్టంప్ ఆవలగా వెళ్లిపోతున్న బంతిని ఊరికినే టచ్ చేసి స్లిప్స్లో క్యాచ్ ఇచ్చాడీ లెఫ్ట్ హ్యాండర్. ఇక శ్రేయాస్ అయ్యర్ అయితే.. వచ్చీ రాగానే బౌండరీ బాదాలనే తపనతో అవుటయ్యాడు. అప్పటికే రెండు కీలక వికెట్లు పోయిన నేపథ్యంలో ఇన్నింగ్స్ నిర్మించాల్సిన అతను ఇలా అనవసర షాట్ ఆడి అవుటవడంపై కూడా ఫ్యాన్స్ మండిపడుతున్నారు.