వరల్డ్ కప్లో భారత్, పాకిస్తాన్ మ్యాచ్కు అంతా రెడీ అయింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఈ క్రమంలో గత వరల్డ్ కప్లో పాక్పై రోహిత్ శర్మ చేసిన భారీ శతకాన్ని ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్పై సెంచరీతో రాణించిన రోహిత్.. పాక్పై కూడా అదే జోరు కొనసాగించాలని కోరుకుంటున్నారు.
ఇంగ్లండ్ వేదికగా జరిగిన గత వరల్డ్ కప్లో పాక్పై రోహిత్ చెలరేగాడు. ఓవరాల్ ఆ వరల్డ్ కప్లో ఐదు సెంచరీలతో చెలరేగిన అతను.. ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జరిగిన మ్యాచులో పాక్పై విశ్వరూపమే చూపించాడు. పాకిస్తాన్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న అతను ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ 34 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేసుకున్నాడు.

ఆ తర్వాత 85 బంతుల్లో మూడంకెల స్కోరు చేరుకున్నాడు. అప్పుడు కూడా రోహిత్ జోరు తగ్గలేదు. అదును దొరికినప్పుడల్లా భారీ షాట్లు ఆడుతూ స్కోరు బోర్డును వేగంగా పరుగులు పెట్టించాడీ ఓపెనింగ్ బ్యాటర్. ఈ క్రమంలో 112 బంతుల్లో 140 పరుగుల వద్ద తన శైలికి భిన్నంగా కొత్త షాట్ ఆడబోయి హసన్ అలీ బౌలింగ్లో అవుటయ్యాడు.
ఇంకా అప్పటికి పది ఓవర్ల ఆట మిగిలే ఉంది. కానీ అప్పటికే పాకిస్తాన్కు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోయింది. రోహిత్ భారీ ఇన్నింగ్స్తో ఆ మ్యాచులో భారత్ ఐదు వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ఛేజింగ్లో పాక్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. దీంతో ఆ టీం ఓటమి దిశగా సాగింది. ఆ తర్వాత వర్షం కూడా పడటంతో పాకిస్తాన్ ఓటమి ఖాయమైంది.
ఈ భారీ ఇన్నింగ్స్ గుర్తు చేసుకుంటున్న అభిమానులు.. ఈ వరల్డ్ కప్లో కూడా రోహిత్ అదే స్థాయి ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నారు. అహ్మదాబాద్ మంచి బ్యాటింగ్ పిచ్ కూడా కావడంతో ఈసారి రోహిత్ డబుల్ సెంచరీ చేయాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి రోహిత్ అదే జోరు చూపిస్తూ మరో భారీ శతకం సాధిస్తాడేమో చూడాలి.