టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ను ఫ్యాన్స్ ఓ ఆట ఆడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా శార్దూల్పై రకరకాల ట్రోల్స్, మీమ్స్ షేర్ చేస్తున్నారు. ఇప్పుడివి తెగ వైరల్ అవుతున్నాయి.
టీమిండియా, పాకిస్తాన్ జట్లు శనివారం అహ్మదాబాద్ వేదికగా తమ వరల్డ్ కప్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ను భారత్ దారుణంగా ఓడించింది. మొదట పాకిస్తాన్ బ్యాటర్లను భారత బౌలర్లు వణికించారు. ఆ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(86) దెబ్బకు పాకిస్తాన్ బౌలింగ్ అటాక్ ఎందుకూ పనికిరాకుండా పోయింది. దీంతో మరో 19 ఓవర్లు మిగిలుండగానే భారత్ విజయం దక్కించుకుంది.

అయితే ఈ మ్యాచ్లో టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యాలతో పాటు స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్లు ఐదుగురూ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. కానీ శార్దూల్ ఠాకూర్ మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మ్యాచ్లో రెండు ఓవర్లు మాత్రమే వేసిన శార్దూల్.. 12 పరుగులిచ్చి వికెట్ రాబట్టడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక బ్యాటింగ్లో అతడికి క్రీజులోకొచ్చే అవకాశమే రాలేదు.
నిజానికి ఈ మ్యాచ్లో శార్దూల్ ప్లేస్లో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడతాడని అంతా అనుకున్నారు. గవాస్కర్ లాంటి సీనియర్లు కూడా అశ్విన్నే జట్టులోకి తీసుకుంటే బాగుంటుందంటూ సూచనలిచ్చారు. కానీ టీం మేనేజ్మెంట్ మాత్రం మూడో స్పిన్నర్ కంటే రెండో ఆల్రౌండర్ జట్టులో ఉండడమే బెటర్ అని భావించి.. అశ్విన్ను పక్కన పెట్టి శార్దూల్ని జట్టులోకి తీసుకుంది. అయితే మ్యాచ్లో శార్దూల్ ఒక్క వికెట్ కూడా తీయలేకపోవడంతో అతడిని ట్రోల్ చేస్తూ విపరీతంగా మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
ఎక్స్ వేదికగా ఓ యూజర్ 'భయ్యా..! శార్దూల్ కూడా మ్యాచ్ ఆడాడు కదా.. లేదంటే జస్ట్ చూడడానికి వచ్చాడా..? అక్షర్ పటేల్ ఉంటే బాగుండేది' అని కామెంట్ చేయగా.. ఇంకో నెటిజన్.. 'అసలు శార్దూల్ ఠాకూర్ జట్టులో ఎందుకున్నాడు..? ఆడడానికా లేదా స్కై, షమిలను జట్టులోకి రాకుండా ఆపడానికా..?' అని మండిపడ్డాడు. మరో యూజర్ అయితే శార్దూల్ ఠాకూర్ ఈ మధ్య కాలంలో ఆడిన మ్యాచ్ల్లో ఎలా ఫెయిల్ అవుతున్నాడో చెబుతూ ఓ పెద్ద లిస్టే షేర్ చేశాడు.
కాగా.. శార్దూల్ ఈ మధ్య కాలంలో ఆడిన ఏ మ్యాచ్లోనూ పెద్దగా రాణించింది లేదు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో కూడా శార్దూల్ 6 ఓవర్లు వేసి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 3 వన్డేల సిరీస్లలో కూడా ఠాకూర్ ఘోరంగా విఫలమయ్యాడు. తొలి మ్యాచ్లో 10 ఓవర్లు విసిరి 78 పరుగులిచ్చిన శార్దూల్ ఒక్క వికెట్ కూడా తీయలేదు. రెండో మ్యాచ్లో 4 ఓవర్లలో కేవలం 35 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేదు. ఇక మూడో మ్యాచ్లో శార్దూల్కు ఆడే అవకాశం రాలేదు.