వరల్డ్ కప్లో 20 ఏళ్ల తర్వాత న్యూజిల్యాండ్ను టీమిండియా ఓడించింది. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్.. భారీ స్కోరు చేసేలా కనిపించింది. తన క్యాచ్ నేలపాలు చేసిన రవీంద్ర జడేజా.. ఎంత తప్పు చేశానని బాధ పడేలా రచిన్ రవీంద్ర (75) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
అతనికి జత కలిసిన డారియల్ మిచెల్ (130) కూడా చెలరేగాడు. అయితే చివర్లో మహమ్మద్ షమీ ఐదు వికెట్లతో సత్తా చాటడంతో కివీస్ కేవలం 273 పరుగులు మాత్రమే చేయగలిగింది. మిచెల్, రవీంద్ర మినహా మిగతా ఏ బ్యాటర్నూ క్రీజులో కుదురుకోనివ్వలేదు భారత బౌలర్లు. దీంతో ఆ టీం ఆశించిన భారీ స్కోరు చేయలేకపోయింది.

ఇక లక్ష్య ఛేదనను భారత్ దూకుడుగానే ఆరంభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (46) మరోసారి ధనాధన్ షాట్లతో జట్టుకు అదిరే ఆరంభం అందించాడు. అతనితోపాటు శుభ్మన్ గిల్ (26) కూడా ఇన్నింగ్స్ చక్కగా ఆరంభించాడు. కానీ ఆ తర్వాత అనవసరంగా షార్ట్ బాల్ను ఆడబోయి మిచెల్కు క్యాచ్ ఇచ్చాడు.
అయ్యర్ క్రీజులోకి వచ్చేసరికి అతని ఐపీఎల్ టీంమేట్ లోకీ ఫెర్గూసన్ బౌలింగ్ చేస్తున్నాడు. అంతకుముందే శుభ్మన్ గిల్ను అవుట్ చేసిన ఫెర్గూసన్.. అయ్యర్ క్రీజులోకి రాగానా షార్ట్ బాల్ విసిరాడు. వీటిని ఎదుర్కోవడానికి అయ్యర్ బాగా ఇబ్బంది పడతాడన్న సంగతి అందరికీ తెలిసిందే.
అయితే లోకీ వేసిన బంతిని చక్కటి పుల్ షాట్ ఆడిన అయ్యర్.. బౌండరీకి తలరించాడు. దీంతో అతను కూడా మంచి కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడని అంతా అనుకున్నారు. ఇలా అతను మంచి జోరు చూపిస్తున్న సమయంలో మంచు ప్రభావం వల్ల మ్యాచ్ను కాసేపు ఆపేయాల్సి వచ్చింది.
ఆ తర్వాత మ్యాచ్ మళ్లీ అవ్వగానే ఫెర్గూసన్ మరో షాట్ బాల్ సంధించాడు. దాన్ని కూడా ఎలాగైనా పుల్ చేయాలని అయ్యర్ అనుకున్నాడు. కానీ అతను అనుకున్నట్లుగా షాట్ ఎగ్జిక్యూల్ కాలేదు. దీంతో అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న డెవాన్ కాన్వే ఈజీగా దాన్ని పట్టేశాడు.
ఈ మ్యాచులో డెవాన్ కాన్వే క్యాచ్ అందుకొని భారత్కు తొలి బ్రేక్ ఇచ్చిన అయ్యర్.. అదే కాన్వేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. అయ్యర్ షార్ట్ బాల్ సమస్యను మరోసారి ఎత్తిచూపారు. ఇలాగైతే అయ్యర్ ఫ్యూచర్లో చాలా దెబ్బ తింటాడని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.