టీమిండియా చేతిలో పాకిస్తాన్ దారుణంగా ఓడిన తర్వాత ఆ జట్టు పేసర్ షాహీన్ షా అఫ్రిదీని ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మ్యాచ్కు ముందు భారత్పై చెలరేగి ఆడతానంటూ అతడు చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. భారత్తో జరిగిన వరల్డ్ కప్ మ్యాచ్లో పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా విభాగాల్లో ఫెయిల్ కావడంతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది.
ఈ మ్యాచ్కు ముందు రోజు అహ్మదాబాద్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ జట్లు ప్రాక్టీస్ చేశాయి. పాక్ జట్టు ప్రాక్టీస్ తర్వాత గ్రౌండ్ బయటకు వచ్చిన షాహీన్ను రిపోర్టర్లు, ఫ్యాన్స్ చుట్టుముట్టారు. రిపోర్టర్లు ప్రాక్టీస్ గురించి ప్రశ్నలడుతుంటే, ఫ్యాన్స్ సెల్ఫీలు కావాలంటూ పట్టుబట్టారు. దీంతో షాహీన్.. 'ఇప్పుడు కాదు.. భారత్తో మ్యాచ్లో 5 వికెట్లు తీసిన తర్వాత..' అంటూ వెళ్లిపోయాడు.

ఇక నిన్నటి మ్యాచ్లో మొదట భారత బౌలర్ల దెబ్బకు పాక్ బ్యాటింగ్ లైనప్ విలవిల్లాడింది. దీంతో ఆ జట్టు కేవలం 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత బౌలర్లు కూడా ఫెయిల్ కావడంతో దారుణ ఓటమిని మూటగట్టుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (86) ధాటికి మరో 19 ఓవర్లు మిగిలుండగానే టీమిండియా ఈజీ విక్టరీ సాధించింది. ఈ మ్యాచ్లో షాహీన్ 6 ఓవర్లు వేసి 36 రన్స్ ఇచ్చి కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
ఇక మ్యాచ్ రిజల్ట్ తర్వాత సోషల్ మీడియాలో ఒకపక్క పాక్ ఓటమి గురించి జోకులు పేలుస్తున్న యూజర్స్.. మరోపక్క షాహీన్ను టార్గెట్ చేస్తూ ట్రోల్స్, మీమ్స్ తెగ షేర్ చేస్తున్నారు. 'ఏది 5 వికెట్లు తీస్తానన్నావ్..', 'మీ పాకిస్తాన్ ఆటగాళ్లకి బిల్డప్లు తప్ప మైదానంలో ఆడడం మాత్రం రాదు..', 'అయ్యో! ఇక షాహీన్ ఎప్పుడూ సెల్ఫీ క్లిక్ చేయడేమో..' అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.