టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఛేజింగ్లో తానే కింగ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. ఆదివారం జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్లో అద్భుతమైన బ్యాటింగ్ అదరగొట్టాడు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా కేవలం 2 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలిచింది.
అలాంటి సమయంలో కేఎల్ రాహుల్తో కలిసి విరాట్ కోహ్లీ మరపురాని ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో పిచ్ ఏ మాత్రం బ్యాటింగ్కు సహకరించలేదు. పూర్తి స్థాయి స్లో పిచ్పై స్పిన్నర్లకు మాత్రమే కొంత సహకారం అందుతోంది. దీంతో ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్లైన స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, మ్యాక్స్వెల్ లాంటి ఆటగాళ్లే తడబడి తమ వికెట్ పారేసుకున్నారు.

లక్ష్య ఛేదనలో తొలి బంతి నుంచే భారత్ తడబడింది. స్టార్క్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతికే ఇషాన్ కిషన్ (0) అనవసరమైన షాట్ ఆడి స్లిప్స్లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తరువాత హేజిల్వుడ్ ఓవర్లో రోహిత్ శర్మ (0), శ్రేయస్ అయ్యర్ (0) కూడా ఖాతా తెరవకుండానే వెనుతిరిగారు. అలాంటి టైంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. కేఎల్ రాహుల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు.
ఈ క్రమంలోనే 75 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ 116 బంతుల్లో 85 రన్స్ చేసి అవుటయ్యాడు. కోహ్లీ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్తో టీమిండియా ఓటమి అంచు నుంచి గెలుపు ముంగిట్లోకి చేరింది. ఈ ఇన్నింగ్స్లో 6 ఫోర్లు కొట్టిన కోహ్లీ ఒక్క సిక్స్ కూడా కొట్టకపోవడం గమనార్హం. తను చాలా జాగ్రత్తగా ఆడుతూ రాహుల్ కూడా వికెట్ పారేసుకోకుండా సూచనలు చేశాడు.
ఇక కోహ్లీ అవుటయ్యే సమయానికి భారత్ 37.4 ఓవర్లలో 167 పరుగుల వద్ద ఉంది. ఆ తర్వాత కేఎల్ రాహుల్(97) లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ క్రమంలోనే 165 రన్స్ చేసిన కోహ్లీ, రాహుల్ జోడీ భారత్ తరపున వరల్డ్ కప్ టోర్నీల్లో 4వ వికెట్కు అత్యధిక పార్ట్నర్షిప్ నెలకొల్పిన జోడీగా రికార్డులకెక్కింది.
ఇలా జట్టును ఆదుకున్న కోహ్లీ ఇన్నింగ్స్కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కోహ్లీ మరోసారి తనను ఛేజ్ మాస్టర్ అని ఎందుకు అంటారో నిరూపించాడని అంటున్నారు. పదేళ్లుగా టీమిండియాను కోహ్లీ కాపాడుతూనే ఉన్నాడని పొగిడేస్తున్నారు. ఏళ్లు గడిచినా ఈ పరిస్థితి మాత్రం మారలేదని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.