శ్రీలంకపై న్యూజిల్యాండ్ భారీ విజయం సాధించడంతో సెమీఫైనల్ చేరే జట్లపై ఒక క్లారిటీ వచ్చేసింది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు సెమీస్ చేరడం అసంభవం. అంటే ఇప్పటికే సెమీస్ బెర్తు ఖాయం చేసుకున్న టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సరసన ఇప్పుడు న్యూజిల్యాండ్ చేరుతుందన్నమాట. దీంతో ఏయే జట్లు ఎవరితో సెమీస్ ఆడతాయనే విషయంపై కూడా స్పష్టత వచ్చేసింది.
ఈ క్రమంలో అందరూ కూడా ఫైనల్ ఏ జట్లు చేరతాయని అంచనాలు వేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఫామ్, జట్టు బలాబలాలు పరిశీలించిన ఫ్యాన్స్ కూడా టీమిండియా, ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం ఖాయం అంటున్నారు. దీంతో 2003 వరల్డ్ కప్ ఫైనల్ రిపీట్ అవుతుందని అంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే ఈ రెండు టీమ్స్ అంత చక్కని ఫామ్లో ఉన్నాయి.

ఈ వరల్డ్ కప్లో అద్భుతమైన ఫామ్లో ఉన్న రెండు జట్లు ఏవంటే అందరూ చటుక్కున భారత్, ఆస్ట్రేలియా అని చెప్పేస్తారు. సౌతాఫ్రికా, న్యూజిల్యాండ్ కూడా మంచి ఫామ్ కనబరిచినా.. ఈ రెండు టీమ్స్ లీగ్ దశలో తడబడటం కనిపించింది. అయితే టీమిండియా ఏమాత్రం తడబాటు లేకుండానే సెమీఫైనల్ చేరుకుంది. ఇక ఆసీస్ ఆరంభంలో తడబడినా.. ఆ తర్వాత ఏమాత్రం వెనక్కు తగ్గలేదు.
ఈ రెండు టీమ్స్ తమ చివరి లీగ్ మ్యాచుల్లో కూడా చెలరేగాయి. ఆఫ్ఘన్పై అద్భుతంగా ఆడిన ఆసీస్ ఇన్నింగ్సులో గ్లెన్ మ్యాక్స్వెల్ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. ఇక భారత్ చివరగా ఆడిన మ్యాచులో సౌతాఫ్రికాపై క్లిష్టమైన పిచ్పై అద్భుత శతకంతో కోహ్లీ కూడా హిస్టరీ క్రియేట్ చేశాడు. ఇక నామమాత్రపు చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్ను టీమిండియా ఢీకొంటుంది.
ఆ తర్వాత భారత్, న్యూజిల్యాండ్ సెమీస్ జరుగుతుంది. 2019లో కూడా ఈ రెండు జట్ల మధ్యనే సెమీస్ జరిగింది. దానిలో భారత్ ఓటమిపాలై ఇంటిదారి పట్టింది. ఇప్పుడు ఆ ఓటమికి పగ తీర్చుకొని ఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే కివీస్ కన్నా కూడా భారత్ మంచి ఫామ్లో ఉంది.
ఇక ఛేజింగ్ చేయాల్సి వస్తే సౌతాఫ్రికా తడబడుతుండటం అందరూ చూస్తున్నదే.. ఆసీస్ కచ్చితంగా దీన్ని అవకాశంగా ఉపయోగించుకొని రెండో సెమీస్లో సఫారీలను ఓడించడం కూడా ఖాయమేనని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదే జరిగితే ఆసీస్, భారత్ మధ్యనే ఫైనల్ జరుగుతుంది. అహ్మదాబాద్ చేరుకునే జట్లు ఇవేనని, ఫైనల్లో ఆసీస్ను ఓడించిన భారత్ కప్పు అందుకుంటుందని ఫ్యాన్స్ జోస్యం చెప్తున్నారు.