ఈ వరల్డ్ కప్లో ఇంగ్లండ్ జట్టుకు రెండో విజయం దక్కింది. పసికూన నెదర్లాండ్స్పై ప్రతాపం చూపించిన ఇంగ్లండ్ జయభేరి మోగించింది. ఏకంగా 160 పరుగుల తేడాతో ఈ మ్యాచులో విజయం సాధించింది. పూణేలోని ఎంసీఏ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో నెదర్లాండ్స్ను ఎదుర్కొన్న ఇంగ్లండ్ చెలరేగింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ సారధి జోస్ బట్లర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
డేవిడ్ మలాన్ (87) అద్భుతంగా ఆడాడు. ఆ తర్వాత అతనికి జతకలిసిన బెన్ స్టోక్స్ (108) చెలరేగాడు. వీరితోపాటు ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ (51) కూడా హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 339 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ లక్ష్య ఛేదనలో నెదర్లాండ్స్ దారుణంగా తడబడింది. తెలుగు కుర్రాడు తేజ నిడమనూరు (41 నాటౌట్) పోరాడినా అతనికి సహకారం లభించలేదు.

వెస్లీ బారెసీ (37), సైబ్రాండ్ ఎండెల్బ్రెట్ (33), స్కాట్ ఎడ్వర్డ్స్ (38) తమకు దక్కిన ఆరంభాలను భారీ స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యారు. దీంతో నెదర్లాండ్స్ జట్టు 37.2 ఓవర్లలో కేవలం 179 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఇంగ్లండ్ ఏకంగా 160 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ ఓటమిపై నెదర్లాండ్స్ సారధి స్కాట్ ఎడ్వర్డ్స్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'బంతితో మ్యాచ్ను సరిగా ఆరంభించలేకపోయాం. ఆ తర్వాత బౌలర్లు మళ్లీ పుంజుకున్నారు. కానీ చివర్లో ఇంగ్లండ్ మా పట్టు నుంచి జారిపోయింది. ఇక బ్యాటుతో మళ్లీ పాత కథే. ఇది చాలా మంచి పిచ్. మేం కొన్ని ప్రయోగాలు చేశాం కానీ.. ఇంగ్లండ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ఛేజింగ్లో బ్యాలెన్స్ ఉండటం చాలా ముఖ్యం. మా టీం అదే చేయలేకపోయింది' అని ఎడ్వర్డ్స్ చెప్పాడు.
'పవర్ ప్లేలో కీలకమైన పరుగులు చేయాలి. అదే సమయంలో మిడిల్ ఓవర్లలో చేతిలో వికెట్లు ఉండటం ముఖ్యం. మేం ఈ విషయంలో ఏం చేయాలో చర్చించుకొని ఒక సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. మెరుగవ్వాలంటే ఏం చేయాలో ఒక నిర్ణయానికి రావాలి. మేం అక్కడక్కడా మెరుగ్గా రాణిస్తున్నాం, కానీ దాన్ని ఎక్కువ కాలం కొనసాగించలేకపోతున్నాం' అని వివరించాడు.
ఇక తమ చివరి లీగ్ మ్యాచులో నెదర్లాండ్స్ జట్టు.. టీమిండియాను ఢీకొట్టనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. దీని గురించి కూడా ఎడ్వర్డ్స్ మాట్లాడాడు. 'బెంగళూరులో కీలకపోరుకు రెడీ అవుతున్నాం. అక్కడ పరిస్థితులు మరింత అద్భుతంగా ఉంటాయని అనుకుంటున్నా. ఆ మ్యాచులో రాణించేందుకు ఎదురు చూస్తున్నాం' అని తెలిపాడు.