అహ్మదాబాద్: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఐసీసీ ప్రపంచకప్ 2023 టోర్నమెంట్ మొదలైంది. అసలు సిసలు మ్యాచ్లు ఆరంభం అయ్యాయి. ఫైనల్ కూడా కలుపుకొంటే మొత్తం 48 మ్యాచ్లు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. నవంబర్ 12వ తేదీన భారత్- నెదర్లాండ్స్ మధ్య జరిగే మ్యాచ్తో లీగ్ దశ ముగుస్తుంది. అదే నెల 15, 16 తేదీల్లో సెమీ ఫైనల్స్ ఉంటాయి. 19న ఫైనల్.
గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్- న్యూజిలాండ్ తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. నిర్ణీత 50 ఓవర్లల్లో తొమ్మిది వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. బ్యాటర్లు సమష్టిగా రాణించారు. న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్ పెట్టారు.

జానీ బెయిర్స్టో- 33, జో రూట్- 77, కేప్టెన్ జోస్ బట్లర్- 43 పరుగులు చేశారు. డేవిడ్ మలన్- 14, హ్యారీ బ్రూక్- 25, లియామ్ లివింగ్స్టొన్- 20, మొయిన్ అలీ- 11, సామ్ కుర్రన్- 14, క్రిస్ వోక్స్- 11, ఆదిల్ రషీద్- 15, మార్క్ వుడ్- 13 పరుగులు చేశారు. న్యూజిలాండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఫర్వాలేదనిపించుకుంది. జేమ్స్ నీషమ్ తప్ప బౌలర్లందరూ వికెట్లు పడగొట్టిన వారే.
283 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బ్లాక్ క్యాప్స్ దుమ్ము లేపుతున్నారు. ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. జట్టు స్కోరు 10 పరుగుల వద్ద ఉన్నప్పుడు విల్ యంగ్ అవుట్ అయ్యాడు. అతనిది గోల్డెన్ డక్. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ దారి పట్టాడు. అతని స్థానంలో ఫస్ట్ డౌన్గా రచిన్ రవీంద్ర క్రీజ్లోకి వచ్చాడు.

అక్కడ మొదలైంది న్యూజిలాండ్ పరుగుల సునామీ. ఇంగ్లాండ్ బౌలర్ల తుక్కు రేగ్గొట్టారు. రెండో ఓవర్ తొలి బంతికి వికెట్ పడగొట్టిన బౌలర్లు.. మరో వికెట్ల కోసం మ్యాచ్ మొత్తం చెమటోడ్చాల్సి వచ్చింది. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర తలో సెంచరీ బాది అవతల పడేశారు. మ్యాచ్ మొత్తాన్నీ లాగేసుకున్నారు.
ఓవర్కు ఏడు పరుగులు చొప్పున పిండుకున్నారు వారిద్దరూ. 32 ఓవర్లు ముగిసేసరికి బ్లాక్ క్యాప్స్ ఒక వికెట్ నష్టానికి 226 పరుగులు చేశారంటే వారి దూకుడు ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కాన్వే, రవీంద్ర పోటీ పడి పరుగులు సాధించారు. సిక్సర్లు, ఫోర్లతో మోతెక్కించారు.

బ్యాటింగ్ ఆర్డర్లో రచిన్ రవీంద్రకు ప్రమోషన్ ఇవ్వడం సత్ఫలితాన్ని ఇచ్చింది. దూకుడుగా ఆడే మనస్తత్వం ఉన్న రచిన్ను వామప్స్లో కూడా టాప్ ఆర్డర్, ఓపెనర్గా బ్యాటింగ్కు పంపించింది న్యూజిలాండ్ మేనేజ్మెంట్. అక్కడ అతను సక్సెస్ అయ్యాడు. అదే మెరుపుదాడినీ ఇక్కడా కంటిన్యూ చేస్తోన్నాడు.
దీనిపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. రచిన్ రవీంద్రను టాప్ ఆర్డర్లోకి పంపి న్యూజిలాండ్ ప్రత్యర్థి జట్లకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చిందని వ్యాఖ్యానించాడు. ఆ ప్రయోగం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చిందని పేర్కొన్నాడు. ఈ టోర్నమెంట్ మొత్తానికీ అతని దూకుడు కొనసాగుతుందని పేర్కొన్నాడు.

గతంలో భారత్ కూడా ఇలాంటి ప్రయోగమే చేసిందని రవిశాస్త్రి గుర్తు చేశాడు. సచిన్ టెండుల్కర్ను టాప్ ఆర్డర్, ఓపెనర్గా పంపించి తిరుగులేని విజయాలను అందుకుందని, రోహిత్ శర్మను కూడా ప్రమోట్ చేసిందని పేర్కొన్నాడు. ఇప్పుడు అలాంటి ప్రయోగమే న్యూజిలాండ్ చేసిందని గుర్తు చేశాడు.