టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్కు గుస్సా వచ్చింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయం ఏమాత్రం బాగలేదంటూ విమర్శించాడీ లెజెండ్. ఎందుకంటే.. వరల్డ్ కప్లో భారత్తో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ ఆడిన మ్యాచుల్లో పిచ్లకు ఐసీసీ గొప్ప రేటింగ్ ఇవ్వలేదు. చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ తలపడగా.. అహ్మదాబాద్లో భారత్, పాకిస్తాన్ జట్లు ఢీకొట్టిన సంగతి తెలిసిందే.
ఈ రెండు మ్యాచులు జరిగిన పిచ్లకు 'యావరేజ్' రేటింగ్ ఇచ్చినట్లు ఐసీసీ ప్రకటించింది. దీనిపై ద్రావిడ్ అసహనం వ్యక్తం చేశాడు. కేవలం హైస్కోరింగ్ మ్యాచులపైనే ఫోకస్ పెట్టడం కరెక్ట్ కాదని అన్నాడు. అది కూడా వన్డేల్లో అలా చేయకూడదని, బ్యాటర్ల టెక్నిక్కు పరీక్ష ఉండాలని చెప్పాడు. ఈ రెండు మ్యాచుల్లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన సంగతి తెలిసిందే.

'ఆ రెండు పిచ్లకు యావరేజ్ రేటింగ్ ఇచ్చారు. దీన్ని నేను ఏమాత్రం సమర్థించను. అవి చాలా మంచి వికెట్లని నా ఫీలింగ్' అని ద్రావిడ్ చెప్పాడు. ధర్మశాల వేదికగా న్యూజిల్యాండ్తో తలపడేందుకు ముందు ద్రావిడ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మంచి పిచ్ అంటే భారీ స్కోర్లు నమోదవ్వాలనే ఆలోచనే తప్పని ఈ లెజెండ్ అభిప్రాయపడ్డాడు. స్పిన్ బౌలింగ్, స్ట్రైక్ రొటేషన్, ఎఫెక్టివ్ బ్యాటింగ్.. ఇలా ఎన్నో స్కిల్స్ను మెచ్చుకోవాల్సిన అవసరం ఉందన్నాడు.
అవన్నీ వదిలేసి కేవలం సిక్సర్లు, ఫోర్ల మీదనే ఆధారపడి పిచ్లకు రేటింగ్ ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు. వరల్డ్ కప్ వంటి సుదీర్ఘమైన టోర్నీలో వేరు వేరు పరిస్థితులకు అలవాటు పడటం కూడా చాలా ముఖ్యమని, అలా కాకుండా బ్యాటర్లకు అనుకూలంగా ఉండే పిచ్లు తయారు చేస్తే బౌలర్ల పాత్ర తగ్గిపోతుందని అన్నాడు. 'మిడిలో ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం వంటి ఎన్నో స్కిల్స్ను మనం గమనించాలి. అందుకే నేను ఈ ఐసీసీ నిర్ణయంతో విభేదిస్తున్నా' అని ద్రావిడ్ స్పష్టం చేశాడు.
'జడేజా, శాంట్నర్, జంపా వంటి స్పిన్నర్ల బౌలింగ్, కేన్ విలియమ్సన్ వంటి బ్యాటర్లు మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం. ఇవన్నీ చూడాలి. ఆసీస్పై కోహ్లీ, రాహుల్ ఆడిన తీరు.. ఇవన్నీ కూడా స్కిల్సే. వాటిని కూడా చూపించాలి కదా. ఢిల్లీ, పూణేల్లో మేం ఆడాం. అక్కడ మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేయడం అంత కష్టమేం కాదు. ఎవరు ఎక్కువ ఫోర్లు, సిక్సర్లు బాదారనేదే అక్కడ పోటీ. కేవలం దాన్ని బట్టే వికెట్లను జడ్జ్ చేయడం సరికాదని నా అభిప్రాయం' అని తేల్చిచెప్పాడు.