ప్రస్తుతం వరల్డ్ కప్లో ఓటమే ఎరుగని జట్టు కేవలం భారత్ మాత్రమే. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచుల్లో భారత్ జయభేరి మోగించింది. ఇక చివరి లీగ్ మ్యాచులో పసికూన నెదర్లాండ్స్ను ఢీకొట్టేందుకు రెడీ అవుతోంది. ఈ క్రమంలో భారత్ జోరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తీక్ కూడా టీమిండియాను మెచ్చుకున్నాడు.
'నేను కొంచెం రిస్క్ తీసుకొని చెప్తున్నా.. కానీ ప్రస్తుతం ఆడుతున్న భారత జట్టు ఇప్పటి వరకు టీమిండియా చరిత్రలోనే అత్యంత బలమైనది. ముఖ్యంగా వన్డేల్లో ఇంత కన్నా బలమైన భారత వన్డే టీంను నేను చూడలేదు' అని దినేష్ కార్తీక్ అన్నాడు. ముఖ్యంగా వరల్డ్ కప్లలో ఇంతలా డామినేట్ చేసిన మరో టీమిండియాను తాను చూడలేదని డీకే తెలిపాడు.

'గతంలో ఆడిన భారత జట్లను ఈ టీంతో ఢీకొట్టి చూడండి. అంతకుముందు అద్భుతంగా ఆడిన టీమ్స్ కూడా ఈ జట్టు ముందు ఏమాత్రం నిలవలేవు. పెర్ఫామెన్స్, టీం చూపుతున్న ప్రెషర్ చూసినా సరే.. ఇంత కన్నా బెటర్ వన్డే టీంను మనం ఎక్కడా చూడం. కనిపించదంతే' అని డీకే అన్నాడు. నెదర్లాండ్స్తో చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే మ్యాచులో ఆడిన తర్వాత సెమీస్లో కూడా ఇదే జోరు కొనసాగించాలని టీమిండియా భావిస్తోంది.
ఈ క్రమంలో సెమీస్ గురించి మాట్లాడిన డీకే.. 'ఆ మ్యాచ్ ముంబైలో.. ఆ మ్యాచ్లో మొదటి పెద్ద డెసిషన్ ఏంటంటే.. టాస్ గెలిస్తే ముందు బ్యాటింగ్ చేయాలా? లేక బౌలింగ్ చేయాలా? అనే. ఎందుకంటే ఇక్కడ మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయినా సరే ముందు ఆ తొలి స్పెల్ను మాత్రం ఎలాగోలా ఎదుర్కోవాల్సి వస్తుంది' అని డీకే వివరించాడు.

'రెండో ఇన్నింగ్సులో కూడా తొలి పది ఓవర్లు బంతి స్వింగ్ అవుతుంది. ఇక ఫైనల్స్ వరకు ఈ స్థాయి ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇదే పదకొండు మందితో బరిలో దిగే అవకాశం ఉంది. ప్రతి ప్లేయర్ కూడా తమ పాత్ర ఏంటో క్లియర్గా తెలుసుకొని, దాన్ని నిర్వర్తిస్తున్నారు' అని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.