దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ క్రికెట్ టీం.. భారత్కు వచ్చింది. సెప్టెంబర్ 27న హైదరాబాద్ చేరుకున్న పాకిస్తాన్కు ఇక్కడ ఘనస్వాగతం లభించింది. ఇక్కడి ఆతిథ్యం చూసిన పాక్ టీం కూడా ఆశ్చర్యపోయింది. అవకాశం దొరికిన ప్రతిసారి ఈ అతిథి సేవలను తెగ మెచ్చుకుంటోంది.
ఈ క్రమంలోనే ఒక వార్త నెట్టింట హల్చల్ చేసింది. భారత్లో పాకిస్తాన్ టీం అడుగు పెట్టిన తర్వాత టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీ ఒక ట్వీట్ చేశాడు. పాకిస్తాన్ టీంను తన ఇంటికి డిన్నర్కు రావలసిందిగా కోరాడు. ఈ ట్వీట్ నెట్టింట పెద్ద దుమారం రేపింది. చాలా మంది ఫ్యాన్స్.. కోహ్లీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఏడేళ్ల తర్వాత మా దేశానికి వచ్చిన పాకిస్తాన్ టీంకు హృదయపూర్వక స్వాగతం. నా స్నేహితులు, ముఖ్యంగా షాదాబ్ కోసం మా ఇంట్లో ఒక పార్టీ ఏర్పాటు చేస్తా. లవ్ యూ ఆల్. ఎప్పుడూ ప్రేమను పంచుతూనే ఉండండి' అని ఆ ట్వీట్లో కోహ్లీ పేర్కొన్నాడు. అయితే ఇది చూసిన కొంత మందికి అనుమానం వచ్చింది.
దీంతో బాగా చెక్ చేయగా.. ఇది కోహ్లీ ఒరిజినల్ ట్విట్టర్ ఖాతా కాదని తేలింది. కోహ్లీ ట్విట్టర్ ఖాతా యూజర్ నేమ్ (@imVkohli) కాగా.. ఈ ట్వీట్ చేసిన ఖాతా @amiVkohli అనే యూజర్ నేమ్తో ఉంది. అలాగే కోహ్లీ అఫీషియల్ కాతాలో సెప్టెంబరు 27 నుంచి ఇప్పటి వరకు ఇలాంటి పోస్టులేవీ పెట్టలేదని స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ పారడీ అకౌంట్కు కూడా కోహ్లీ అధికారిక ఖాతాలో ఉన్న ప్రొఫైల్ పిక్చరే ఉంది. సేమ్ టూ సేమ్ బయో కూడా ఉంది. అయితే దాని కిందనే ఇదొక పారడీ అకౌంట్ అని సదరు యూజర్ రాసుకొచ్చాడు. దాన్ని ఎవరూ పెద్దగా గమనించలేదు. కాగా, పాకిస్తాన్ క్రికెటర్లతో కోహ్లీకి మంచి స్నేహం ఉంది.
మ్యాచ్ బయట ఎంత స్నేహంగా ఉంటాడో.. మ్యాచ్లో పాకిస్తాన్ను అంతలా ఉతికారేయడం కోహ్లీకి అలవాటని తెలిసిందే. పాక్ ప్లేయర్లతో నవ్వుతూ కోహ్లీ ముచ్చట్లు చెప్పుకుంటున్న ఫొటోలు చాలా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పారడీ అకౌంట్లో వచ్చిన ట్వీట్ను చాలా మంది నిజమేనని నమ్మేశారు.